Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/518

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అందుకో పథకమున్నూ వేసుకున్నారు వారు. కాగితం-అచ్చు-బైండింగు–ప్రకటన-వీటిఖర్చులన్నీ తామే భరించి మంచి పుస్తకాలచ్చువేయించడమూ, మొదట వచ్చిన రాబడితో తమ పెట్టుబడి తీర్చుకోడమూ, అప్పటికి మిగిలి వుండిన గ్రంథాలన్నీ గ్రంథకర్త కిచ్చెయ్యడమూ - ఇదీ ఆ పథకం. కాపీరైటు గ్రంథకర్తదే. ఈ పథకంలో నీ వీరపూజ బయటికి రావచ్చు" అన్నాడతను.

పుస్తకం నా బసలోనే వుంది.

ఆ రాత్రి, పృధ్వీరాజు, భీమసింహుడు - వీరి చరిత్రలు చదివి వినిపించా నతనికి, కావాలని.

విన్నంత సేపూ అక్కడక్కడ ప్రశ్నలూ వేశాడు, చర్చా సాగించా డతను.

“మంచి గ్రంథం” అన్నాడు, చివరికి.

మర్నాటి పొద్దున్న నాగేశ్వరరావుగారి గదికి తీసుకువెళ్ళాడు, మరిచిపోకుండా నన్నతను.

కుశలప్రశ్నాదికం ముగిశాక, నా సంగతీ, వీరపూజ సంగతి చెప్పాడు కూడా, వారికి.

"మీరీ సాయం చెయ్యాలితని” కని సిఫార్సున్నూ చేశాడు, దృఢంగా.

పుస్తకం వెంటబెట్టుకునే వెళ్ళాన్నేనప్పుడు.

విలవగల బైండు బుక్కుల్లో రాసేవాణ్ణి గ్రంథం, మొదట, నేనా రోజుల్లో.

అచ్చుకివ్వడం తటస్థపడితే, తరవాత, విడికాగితాల మీద రాయడం.

అది నాగేశ్వరరావుగారి కందించాన్నేను.

ఏడెనిమిదిచోట్ల, పదేసీ యిరవయ్యేసీ బంతులు చదివి “మంచి పుస్తకం” అన్నారు, వారును.

"ఇలాంటి చిక్కని భాషలో వుండాలిలాంటి గ్రంథాలు. మద్రాసు రండి, అచ్చువేయించి యిస్తా" ననిన్నీ మాట యిచ్చారు, వారు.

15

చేతిలో పద్నాలుగణాలనర వుండగా, అదే పుచ్చుకుని బయలు దేరాన్నేను.

నడిచీ పడవెక్కీ కాదు, రెయిలెక్కి - అక్కడి యిక్కడికి కాదు మద్రాసు వెళ్ళడానికి - బయలుదేరాను.

మూడువందల డెబ్బయిమైళ్ళ దూరం మాకు మద్రాసు.

పుస్తకం అచ్చు విషయం అంతా నాగేశ్వరరావుగారే చూస్తారు, నిజమే.

మిక్కిలీ అసంభావ్యంగా కనపడుతుం, దెవరికయినా యిది.

కాని, యెన్నో సంభవాలయిపోయా యిలాంటివి నా జీవితంలో.

ఖర్చులకయినా చాలినంతడబ్బు చేతిలో లేదన్న కారణాన నేనెప్పుడూ ప్రయాణం మానుకోలేదు.

మద్రాసు చేరుకోడం - హొటల్లో వొక్కపూట భోజనం చెయ్యడం - ట్రాములో వొక ప్రయాణమున్నూ చెయ్యడం - చాలు, ఈ మాత్రం డబ్బుంటే మద్రాసు వెళ్ళిపోడమే నేను, తరవాత్తరవాత.

494

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి.