నవల రాయాలన్నా, నాటకం రాయాలన్నా, కథ రాయాలన్నా - చివరికి వ్యాసం రాయాలన్నా నాలుగైదు చిత్తులు రాసుకుంటా నివాళ నేను.
“శుభికే, శిర ఆరోహ” అన్న కథతోనే ప్రారంభం యీ పద్ధతి.
ఒక చిత్తు రాసి, అందులో హంసపాదులు పెట్టుకుంటూ సవరణలు చేసుకోడం కాదది, ఏచిత్తు కాచిత్తు మొదణ్ణుంచి చివరిదాకా సమగ్రంగా రాసుకుంటా న్నేను.
పరిస్థితిని బట్టి నాలుగోచిత్తో, అయిదో చిత్తో అనుసరించి సాపు రాసుకుంటాను.
“మరోచిత్తు కూడా అయివుంటే బాగుండేది" అనిపిస్తూ వుండడం కూడా వుం దప్పుడప్పుడు నాకు.
వెంటనే అచ్చుకాకుండా రెండు మూడేళ్ళయినా అది అలా వుండిపోతే - అచ్చు కివ్వడం తటస్థపడ్డప్పుడు మళ్ళీ సమగ్రంగా రాసుకుంటే గాని తృప్తి కాదు నాకు.
పైగా, ఇలా యెన్నిమాట్లు రాసుకున్నా, అందుకు, రెండుపక్కలా రూళ్లు వేసిన మంచి కాగితాలే కావాలి నాకు.
రెయిలుబండికి పట్టాలెంత అగత్యమో, నా కలానికి రూళ్ళంత అగత్యం.
గ్రంథం పెరిగిపోడంవంటి దోషమూ వుందిందులో, వొప్పుకుంటాను; కాని, దీనివల్ల నాకెంతో మేలు కలుగుతోంది.
నా రుచి పురస్కరించుకుని చిత్రణం సమగ్రం కావడమే నా క్కావలసింది.
అచ్చు ప్రారంభం యినాక, యథామాతృకంగా వుందా లేదా అని చూసుకోడమే గాని, మరి, మార్పులు చెయ్య న్నేను.
అచ్చుకిచ్చి, ప్రెస్సువారెన్ని ప్రూపులిచ్చినా, చివరికి మెషీను ప్రూపులోకూడా పేరాలకు పేరాలూ, పద్యాలకు పద్యాలే మార్చేసి, మళ్లీ కంపోజు చెయ్యవలసిన గతి పట్టించేవా రెందరో వున్నారు నాకు తెలుసు.
అది మంచిదనుకో న్నేను.
నా స్థితి చూసి "చాదస్తం” అన్నవా రున్నారు.
"సంస్కారం చాలదు" అన్నవారూ వున్నారు.
మందహాసం చేసి, ముభావంగా వుండిపోయిన ప్రౌఢులూ వున్నారు, చాలామందిని చూశా న్నేను.
అయినా, నే నిందుకు సిగ్గుపడ్డంలేదు.
ఈ పద్ధతి మానుకోలేకుండానూ వున్నాను.
ఎంచేత నంటే?
ఎవరో అనక్కర్లేదు, నామట్టుకి నాకు తెలిసిం దెంత?
నేను చదివిం దెంత అసలు?
నేను చూసిం దెంత, యీ విశాల ప్రపంచంలో?
నాకున్న శ్రుతపాండిత్యం మాత్రం యేపాటిది?
భాషకున్నూ అంతూ దరీ యేదీ?
భావనకు మాత్రం అవధి యెక్కడ?
ఏమయినా, - నేను రాసేది గ్రాంథికం కూడా కాదాయె.
427
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి