Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/450

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

"మరి, యీ విషయమై విజయనగర సామ్రాజ్య భూమికను మరిచిపోయావా?" అంటే లేదు లేదు.

అది జ్ఞాపకం వుంది కనకనే మహారాష్ట్రుల తత్వం అర్థం చేసుకోగలిగాన్నేను.

కాగా, ఆ విప్రకృష్టతలో, విజయనగర సామ్రాజ్యంకంటే, మహారాష్ట్ర సామ్రాజ్యం సన్నికృష్టం మనకు.

అంటే, అది మొన్నటిదీ యిది నిన్నటిదీనీ మనకు.

ఆ మహారాష్ట్రజాతి యేకైక ప్రతినిధి తిలకుగారు బతికే వున్నారు నేను కలంపట్టేటప్పటికి.

కాక, -

ఆంధ్రదేశానికీ మహారాష్ట్ర దేశానికీ కాడిగట్టు.

తెలంగాణాలో ఆ మహారాష్ట్రులతో సహవాసమూ, సాహచర్యమూ కూడా వున్నాయి, మనకు.

మనలో మహారాష్ట్ర దృక్పథమూ వుంది, మహారాష్ట్రుల్లో మన ఆంధ్రదృక్పథమూ వుంది.

మహారాష్ట్రులు మన దగ్గరే నేర్చుకున్నారు, రాజనీతి.

శివాజీకి మన కృష్ణరాయని రాజ్యాంగమే వరవడి.

తిలకుగారే చెప్పా రీసంగతి.

మన రాజనీతి పరిజ్ఞానం మళ్ళీ మనం సంపాదించుకోవాలంటే, మహారాష్ట్రుల దగ్గిరే సంచితం అయివుందింకా అది.

ఆ మహారాష్ట్ర జాతికి చెందిన కథ నేను రాయబూనుకున్నది.

"ఫుల్ జానీబేగమ్” అన్నది ఔరంగజేబు పెట్టిన పేరు.

అసలు పేరా మెది "కమలాబాయి” అని.

ఏసాజీ భార్య ఆమె.

నారాయణరావుశిరకే కొడుకూ కోడలూను వారు.

దివ్యప్రేమ వారిది.

78

"నవలలు రాయలుపరిమాణంలో ప్రకటించాలి. 150 పేజీలకేదీ తక్కువ వుండగూడదు. పేజీకి రెండుకాలాలుగా అచ్చువేయించాలి. వెల 0-8-0 మాత్రమే వుంచాలి."

లెక్కలు చూసుకుని నేనూ రెడ్డిగారూ చేసుకున్న నిర్ణయం ఇది.

బాగానే వుంది, మరి, ఆ కథ ఆ పరిమాణానికి మించితే?

అధవా - అంత కాకపోతే?

ఇలా అనుకుంటూనే శ్రీరామ చుట్టేశా న్నేను.

కాని, తలుచుకుంటే వొణుకు పుడుతుం దివాళ.

ఏమంటే?

అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2

426