మనం ఆంధ్రులం.
మన భాషను మనం పోషించుకుంటాం.
మన జాతీయతను మనం దృఢపరుచుకుంటాం.
మన దేశం మనం బాగుచేసుకుంటాం.
తమిళుడూ ఇంతే చేస్తాడు.
కర్ణాటకుడూ, మహారాష్ట్రుడూ, ఓఢ్రుడూ, గుజరాతీ, బంగాలీ - తక్కినవారూ ఇంతే చేస్తారు.
మరి, భారతదేశమో అంటే, యింకెక్కడుందీ అది?
ఇలా కాకపోతే, మరెలాగ అది బాగుచేసుకోడం?
గుజరాతీ వచ్చి ఆంధ్రభాషనూ, ఆంధ్రజాతీయతనూ, ఆంధ్రదేశాన్నీ వుద్దరిస్తాడా?
ఉద్దరిస్తే ఆ గుజరాతీ సంగతి యెవరు చూస్తారు?
ఆ "యెవరి" సంగతి మాత్రం మరెవరు చూస్తారు?
ఇది గుర్తించుకోలేక ఏమిటేమిటో చిలకపలుకులు పలుకుతారు పరప్రత్యయనేయ బుద్దులు.
కాక, -
రామేశ్వరం అరవల దొక్కళ్ళదే కాదు.
తిరపతీ శ్రీశైలమూ మన ఆంధ్రులవి మాత్రమే కావు.
జగన్నాథం ఓఢ్రుల దొక్కళ్ళదే కాదు.
తక్కినవిన్నీ ఆ ప్రాంతాలవారివే కావు.
భారతజాతీయత స్వత్వాలవి.
భారతజాతీయతకు దోహదా లవి.
ఈ భావం వైదికధర్మం కలిగిస్తోంది మనకు.
ఈ మనభావం సంస్కృతభాష ధ్రువపరుస్తోంది.
కనక, ఆ వైదికధర్మం విడిచిపెట్టేసుకుంటే - ఆ సంస్కృతభాష కూడా విడిచిపెట్టేసుకుంటే - మన భారతీయతనూ, మన జాతీయతనూ, మన మానప్రాణాలనూ నిలపగలవాడు సృష్టిలో లేడు.
76
అయితే, పృథక్త్వం మొదటిదా, ఏకత మొదటిదా మనకు?
మనకు - అంటే ఛప్పన్న దేశాలవారికీ గ్రహణం.
మొదట మనం ఆంధ్రులం.
కనక, తరవాత భారతీయులం.
ఇంత సుస్పష్ట మైన ఈ విషయం తికమకలు చేస్తున్నారు కొంద రిప్పుడు.
అనుమానాలు కలిగిస్తున్నారు.
అపనమ్మకాలు పుట్టిస్తున్నారు.
అపాయకరమైన ప్రయత్నం యిది.
అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2
420