Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/442

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీకృష్ణుడు ద్వారకావాసి.

“అయితే, వారి మాతృభాష లేమిటి?"

"అయోధ్యలోనూ ద్వారకలోనూ జనభాష లేమి టప్పుడు?”

ఈ ప్రశ్నలే పుట్టనివ్వలేదు మన మహర్షులు.

శ్రీరాముడు సంస్కృతభాషలోనే అవతరించాడు.

శ్రీకృష్ణుడున్నూ అంతే.

మిక్కిలీ జటిలాలైన చరిత్రలు వారివి.

ఆదర్శభూతా లైన ప్రవృత్తులున్నూ వారివి.

దేని కదే అని, వొక్కొక్క ప్రపంచం.

సంస్కృతభాష అంతా ఆక్రమించుకుని వున్నా యవి.

కాగా, వారి విషయమై వొక్క అక్షరం కావాలన్నా సంస్కృతమే మనకు గతి.

మన ధర్మేతిహాసా లవి.

కనక, మనం చదివే తీరవలసిన వవి.

మరి, వారిభాష సంస్కృతం కాకపోతే?

"వా రెవరో”

అనేక దేశాలవారికి “మనవాళ్ళు” కారు వారు.

వెంటనే పుడతా యీభావాలు.

"గొప్ప పాత్ర"లని మెప్పు మాత్రం కలగవచ్చు; కాని ఆత్మీయత యేర్పడదు.

ఇది, వారి భారతజాతీయతాజనకత్వానికి గొడ్డలి పెట్టు.

మన మహర్షు లుద్దేశించిన భారతీయైక్యతకున్నూ పిడుగుపాటు.

అంటే?

వారు మన మూలపురుషులు కారు.

మనం వారి వారసులమున్నూ కాము.

దీంతో, ఛప్పన్నదేశాలవారికీ వుండుకున్న దృఢానుబంధం సడలిపోడం లేదూ?

తెగిన్నీపోడం లేదూ?

ఇంతటితో ఆగలేదు మహర్షులు.

మన పురాణసముచ్ఛయమూ, మన శాస్త్రాలూ, మన సర్వస్వమూ సంస్కృతంలోనే నిక్షేపించారు వారు.

ఆ గ్రంథాల్లో దేశభాషల ప్రసక్తే యెత్తలేదు వారు.

అంటే -

మన పురాణపురుషులూ, మన శాస్త్రకారులూ, మన మహర్షులూ సంస్కృతంలోనే అవతరించారు.

సంస్కృతంలోనే ప్రవర్తించారు.

కనకనే ఛప్పన్నదేశాల్లో యే వొక్కదేశంవారూ కారు వారు.

విశేషించి అందరికీ “మనవాళ్ళు.”

“వారు మనవా"ళ్ళయితే, మరి, మనం?

ఒకటి కాదూ?

అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2

418