వ్యవహారం కోర్టు కెక్కింది.
విచారణా జరిగింది విశాఖపట్నం జిల్లాకోర్టులో.
జడ్జీ యెటు మొగ్గుతాడో యెవరికీ తెలియదు.
"సిద్ధాంతిగారిని నెగ్గించా” లని నిశ్చయించుకున్నారు వకీళ్లు.
మహారాజు వికీళ్లూ వున్నా రాపూనుకున్నవారిలో, ప్రచ్ఛన్నంగా.
దివాన్జీ చేసిన కుట్ర తప్ప మహారాజు వాదంలో ధర్మం లేదు, మరి.
ఇటు పెద్దదక్షిణామూర్తిశాస్త్రిగారి తేజస్సున్నూ అటువంటిది, మరి.
కాగా, వొక నాటకం ఆడెయ్యా లనుకున్నారు వారు.
కాక :-
మన విద్యల విలవ బాగా తెలిసినవా రప్పటి లౌక్యులు.
మన విద్వాంసుల యెడల మహానుభావులన్న ఆదర గౌరవ భావాలున్నవారు అప్పటి మన యింగ్లీషు విద్యాధికులున్ను.
ఎంచేతనంటే?
వైదికులయినా నియోగులయినా ఆ లౌక్యుల తండ్రులూ, ఆ యింగ్లీషు విద్యాధికుల తండ్రులూ మన విద్యలు నేర్చినవారూ - కనీసం - సంప్రదాయపరులున్నూ.
బ్రాహ్మణ "ఇతరు”లున్నూ స్వధర్మ పరిజ్ఞాతలూ, స్వధర్మపరులున్నూ అప్పుడు.
వార్షికాలూ, వృత్తులూ, యీనాములూ, చివరి కగ్రహారాలూ యిచ్చి మన విద్యలనూ విద్వాంసులనూ పోషించిన వారందరూ బ్రాహ్మణ "ఇతరు"లే ప్రాయకంగా అప్పుడు, చరిత్ర చూసుకుంటే.
మన అప్పటి ప్రభువులు విద్యలను వ్యాపింపజేశారు; గాని అమ్ముకోలేదు మరి.
వారున్నూ వారే తమ బిడ్డల నింగ్లీషులో ప్రవేశపెట్టినవా రప్పుడు.
ఉద్యోగాలకోసమే వారా పనిచేశారు; గాని మన ధర్మం విడిచిపెట్టుకోడానికీ, ఇంగ్లీషువిద్యలే విద్యలనీ కాదు.
వారి కాభిజాత్యం యెక్కువ.
తరతరాలుగా - యుగయుగాలుగా తమకు వెలుగుతోపిస్తున్న మన విద్యలను కాదనడానికి వారి "అంతరాత్మలు” కలుషితాలు కాలేదు.
"నాకు ఒక విశిష్టధర్మం లేకపోతేగా?" అనుకున్నవారు, వారు.
ఇంగ్లీషువారిలో మాత్రం మతవిద్యలు నేర్చిన స్వధర్మపరులకు సంఘంలో ప్రత్యేకత లేదూ మరీ?” అన్న వివేకం వుండినవారు వారు.
అప్పటి కలాగ ఆత్మగౌరవం వుండిన అలాంటి సంఘంలో మెలుగుతూ వుండినవారు కావడంవల్ల ఆ యింగ్లీషులో ప్రవేశించినవారున్నూ మన విద్యలకూ, మన సంప్రదాయాలకూ, మన ధర్మానికీ దూరం కాలేదు.
పాఠశాలల్లో యింగ్లీషు విద్యలూ నేర్చుకున్నారు, ఇళ్లల్లో వర్ణాశ్రమాచారధర్మాలూ పాటించుకున్నారు, లక్షణంగా వారు.
ఆ “యింగ్లీషువారి” కొడుకులూ నయమే కొంత.
కొంచెం బద్ధకం వంటిది ప్రారంభం అయినా, మన ధర్మాలు వింటూ, మన సంప్రదాయం చూస్తూ మన ఆచారాలు విడిచిపెట్టనివారే వారు.
అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2
362