Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/342

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

"అయితే వుండండి" అంటూ మజ్జిగ తెప్పించి, పుచ్చుకునేదాకా బలవంత పెట్టారు దొరగారు.

ఆ సాయంత్రం గోష్ఠిలో కామరాజుగారే తెచ్చారు గురువుల దగ్గిర యీ ప్రసంగం.

వేంకటరామశాస్త్రిగారు చకితులు కాగా, ఉగ్రులయి పోయారు రామకృష్ణశాస్త్రిగారు.

ఏమయినా, దీంతో "పిఠాపురంలో శనివారం మనకి శనిగొట్టుదినం అయిపోయిం"దని స్థిరపరుచుకున్నా న్నేను.

తరవాతి శనివారంనాడే హోటల్ భోజనం ప్రారంభించా నావేళమట్టుకి, మరి వారం ప్రయత్నం చెయ్యలేదు.

40

"మరి, ప్రయత్నం చెయ్యలే" దన్నాను.

అంటే, నాకు నేనయి ప్రయత్నించలేదు.

అయినా, శనివారంనాడున్నూ వారం భోజనం తటస్థించింది నాకు.

అప్రయత్నమే కా దది, అనుకోనిదిన్నీ.

ప్రతీ మనిషికీ తటస్థిస్తూనేవుంటా యప్పుడప్పుడిలాంటి వెన్నో.

వాటికి కార్యకారణసంబంధాలు కనపడ వొక్కొక్కప్పుడు.

ప్రబుద్ధాంధ్రకు రెండో సంవత్సరం నడుస్తోంది.

మానేజిమెంటు ససిపడక నష్టం రాగా సొంత ముద్రాక్షరశాల అమ్మేసి, కాకినాడ స్కేపు అండుకోలో అచ్చు వేయిస్తున్నా నప్పుడు.

ఒక నెల అరువిస్తారు వారు.

అంటే, వెనుకటి నెల బిల్లు చెల్లిస్తే వచ్చేనెల సంచిక అచ్చు వేసి యిస్తారు. వా రరువుగా.

ఉదయం పనివాళ్లు స్టిక్కు పట్టేలోపున రచనలిస్తే సాయంత్రానికి సంచికలు బెండున్నూ చేసి యిచ్చేవారు వారు.

తమ వాగ్దానం ప్రకారం గతమాసం బిల్లు కొవ్వూరి బసివిరెడ్డిగారి రెండో కుమారులు శ్రీ సూర్యనారాయణరెడ్డిగారు చెల్లించేసి వుంటారు, కనక, కాకినాడ వెడితే చాలు, పన్నెండుగంటల పని.

దీపాలు పెట్టాక తొస్సిపూడిలాకు దగ్గిర పడవ యెక్కితే తెల్లవారేటప్పటికి కాకినాడ - మళ్ళీ దీపాలు పెట్టాక భోజనమున్నూ సావకాశంగా కానిచ్చుకుని కాకినాడలో పడవ యెక్కితే తెల్లవారేటప్పటికి తొస్సిపూడిలాకు - రానూపోనూ పడవకేవు రెండణాలు.

కాకినాడలో రెండుపూటలా పెరుగుతో భోజనం అర్థ రూపాయి, వెరశి పదణాలు కావాలి; గాని పదికాసుల్లేవు చేతిలో.

ఇరుగు పొరుగువారిలో చేబదు ళ్లివ్వగలవారా సమయాన ఇళ్ళల్లో లేరు, వంట మాత్రం అయిపోతోంది ఇంట్లో సాయంత్రం అయిదుగంటల వేళ.

వెళ్ళాలి.

అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2

318