అందులో వురికినవా రప్పటివారిలో ధన్యులుగా చెలామణీ అయిపోయేవారు.
ముఖ్యరంగాలు బందరూ పిఠాపురమూనే అయినా, యావదాంధ్రమూ - రాష్ట్రేతరాంధ్రమూ కూడా అలుముకుపోయిం దది.
ఎక్క డెక్కడి తెనుగువాళ్ళూ కూడా దానికి సంబంధించిన కొత్త వ్యూహాల వివరాలకోసం యెదురుతెన్నులు చూస్తూ వుండేవారు.
అది చల్లారిపోతుందేమో అనిన్నీ ఆత్రపడిపోయేవారు కొందరు.
"కవులకీ కీచులాట లేమిటండీ" అనేవారు కొందరు, తమకే సభ్యత వుండినట్టు, మహా.
"ఇది బాగాలేదు” అని పత్రికలకున్నూ రాసేవారు, ప్రపంచం మునిగిపోతున్నట్టు.
ఇక వింత యేమిటంటే?
ఆ వుభయుల్లోనూ యెవరినో వొకరిని సమర్థిస్తూనే వుండేవారు, వారు.
మళ్లీ వారిలో కొందరు, తమ అభిమానకవులను సమర్థించుకుంటూ తమలోతాము డీకొనేవారు.
కోడిపందేలలో పైపందేలు కాసేవారి ధోరణిగా వుండేది వారిది.
అయితే, ఆ మహాయుద్ధాని గ్గల కారణం వుభయులకూ గూడా ప్రశంసావహం కాకపోయినా, వ్యక్తిపరా లయిన హేళనలూ, దూషణలూ పరిహరించుకోగలిగితే ఉభయుల వాదసరణీ బహూ చమత్కారంగా వుండేది.
మీదుమిక్కిలి మిక్కిలీ ప్రబోధకంగానూ వుండేది.
నామట్టుకి నేను, వివాదరూపంగా వుండిన ఆ వుభయుల రచనలూ కొన్ని కొన్ని చదివి, భాషకూ, సాహిత్యానికీ, కవిత్వానికీ సంబంధించిన అనేక విషయాలు తెలుసుకుని వున్నా నప్పటికే, సుళువుగా.
"అందాక ఇందాక ఎందాక” ఈ శబ్దాలు నిర్భిందుకంగా వాడారు, తిరుపతివేంకటకవు లంతటా.
"ఈ దాకలో అరసున్న వేయింపు"డని రామకృష్ణ కవుల విమర్శ.
"బ్రతిమాలు" అని తిరుపతివేంకట కవుల వాడకం.
“ద్రేవాంగు లన్న ట్టుందీ మాట" అని రామకృష్ణ కవుల విమర్శ.
'అందాఁక, ఇందాఁక, ఎందాఁక' అని సబిందుకంగా వాడాలనీ 'బతిమాలు' అనాలనీ నాకింతవరకూ తెలియనే తెలియ"దన్నా డొక కవి, ఇది చదివి.
"ఇది హేళనే, సందేహంలేదు; కాని యిందులో చమత్కారం వుంది. అంచేత నన్ను బాగా ఆకర్షించింది. ఈ జన్మలో నేనీ శబ్దాలు తప్పుగా వాడనిక" అనిన్నీ అన్నా డతను.
ఇలాంటి ప్రయోజనాలు పొందినవారప్పుడెందరో వున్నా రావాఙ్మయం చదివి.
ఈ మహాయుద్ధం మూలంగా వేంకటశాస్త్రిగారి శిష్యులకున్నూ కొందరికీ మంచి పేరూ ప్రఖ్యాతీ వచ్చాయి.
ముట్నూరి కృష్ణారావుగారు ఆ శిష్యుల్లోనో శాస్త్రిగారి అంతరంగికుల్లోనో ముఖ్యులు.
వారి కృష్ణాపత్రిక వేంకటశాస్త్రిగారిని బాగా పూసుకు వచ్చేది.
247
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి