Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వుండుకున్నది సేవ్యసేవ కానుబంధమే గాని, గురుశిష్యానుబంధం కాదు.

అంచేత, రాయవరం వెళ్ళవలసిన సమయం - అంటే భోజనాల వేళ సమీపించిన కొద్దీ యేమి టేమిటో వుల్లాసం పుట్టుకువచ్చింది, నాకు.

భోజనాలున్నూ అయిపోయాయి.

అయితే, భోజనం పూర్తి కావస్తున్న సమయాన "ఇవాళ కూడా రాయవరం వెళ్ళు" అనిపించుకునే వెళ్ళడమా, నేను వాళ్ళతోనూ, వాళ్లు నాతోనున్నూ చెప్పకుండానే బయలుదేరడమా అని వితర్కం ప్రారంభం అయింది నాకు.

దీనిమీద "మేమే వెడతా"మని వారే సిద్ధపడితే యేమిటి గతి? అని కంగారు పట్టుకుంది.

పోనీ, అదేదో దానికది తేలినప్పుడే చూసుకుందామంటే చివరి కేమవుతుందో అని ఆందోళన అందుకుంది.

కవిత్వంలో కూచుంటే మంచి భావాలూ, వ్యవహారంలో కూచుంటే మంచి యెత్తులూ తట్టే సన్నివేశం అది, తన్మయత్వం కలిగించుకోగల సత్తా అబ్బివుంటే.

నిజం ఆలోచిస్తే, అది ఆందోళన అనికాక, బుద్ధికి వొరపిడి అనే చెప్పుకోవాలి.

ఏమంటే?

నిమ్మకు నీరు పోసినట్టు బుద్ధి నిశ్చలంగా వుండే సందర్భంలో యెలాంటి కల్పనా వెళ్ళదు.

అల్లసాని పెద్దన్న, కవిత్వం చెయ్యడానికి నిరుపహతి స్థలం కావాలన్నాడేగాని, నైశ్చల్యం కావాలన్నాడా మరి?

నే ననేకమాట్లు గుర్తించాను, బుద్ధి స్థిమితంగా వుండినప్పుడు రాత వెళ్ళదు.

అది అభావదశ గాని, మరోటి కాదు.

కాగా, ఆందోళనవంటి ఆ అవస్థవల్ల నాకొక ఆలోచన తట్టింది, హఠాత్తుగా.

రాజా ఆలోచన అయింది, చివరికది.

అప్పుడే భోజనం ప్రారంభించి వుండిన మా అమ్మగారి దగ్గరికి వెళ్ళాను, మెల్లిగా ముందు.

"రాయవరం వెళ్ళడం వాళ్ళో నేనో కనుక్కో”మన్నాను, చివరికి.

వాకిట్లో కూచుని యేదో పుస్తకం చూసుకుంటున్న మా చిన్నన్నగారిది విని, పిట్ట చెయ్యి దాటిపోతోందనుకుని, మాటలోనే అందుకుని "కవిత్వంలో కూచుందామనుకున్నాడు కామోసు, వెళ్ళి పంచాంగం దిద్దిరమ్మను" అంటూ వురిమారు.

ఆ వురుము కోసమే కనిపెట్టుకుని వుండిన నేను నెమిలిపిట్టనయి, మళ్ళీ మాట్టాడకుండా తుర్రుమన్నాను, రెడ్డిగారి పుస్తకం పుచ్చుకుని.

53

ఆవేళ కూడా రెడ్డిగారొక్కరే వుండినారు, ఆఫీసుగదిలో.

చూసుకున్న వేళావిశేషం కామోసు, వారున్నూ నాకోసం యెదురు తెన్నులు చూస్తూ వుండినారు, ఇంకా రాలేదేమా అని.

154

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి - 1