Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మనసారా అనుభవిస్తూనూ వున్నారు.

ఎక్కడపడితే అక్కడే - ఎందుకు పడితే అందుకే పోటీలమీద పోటీలు పడిపోతున్నారు, అహమికతో.

లోభులు కారు, నిందించడానికి.

సంస్కారం మాత్రం లేదు, అంతే.

ఎందుకు లేదూ అంటే, గ్రంథాలు చదవరు, కనక.

ఎందుకు చదవరూ అంటే, వాఙ్మయం విలవ తెలియదు కనక.

కొత్త ప్రాజెక్టులు కట్టాలి, మళ్ళీ-

అధికోత్పత్తి కావాలి.

పరిశ్రమలు వృద్ధిపొందాలి.

రాకపోకల సౌకర్యాలు పెరగాలి.

ఫిలింమీద ఫిలిమున్నూ తయారయిపోవాలి, గబా - గబా.

మరి, వాఙ్మయమో ?

మనిషికి బుద్ధివికాసం కలిగించే ఉత్తమవాఙ్మయమో?

కొత్త సంగతులు తెలిపి, కొత్త రుచులు మప్పి, కొత్త చూపు అలవర్చి, కొత్త దారులు కనపరిచి, కొత్త శక్తి సంఘటించి, కొత్త ఆవేశం పురికొలిపి, కొత్త ప్రపంచంలో వురికించే కొత్త వాఙ్మయమో?

ఉహూ!

పైపై వేషాలే గాని - కుక్షింభరత్వమున్నూ మాత్రమే కాని - అంతరికమైన యీ ఆవేదవ లేదు, జనులకు.

"తనది" "పరులది" అన్న వివేచన కూడా లేశమూ లేదు.

ఈ స్థితిలో, తెనుగుదేశంలో, కవి అయినవాడికి చావుబతుకుల సంరంభమే కాని బతుకు తెరువు ఎలా కలుగుతుందీ?

38

ఏమయినా, ఆ స్థితిలో మా సీత కాపరానికి రావడం నాకు మేలే అయింది.

దాటిపోతుందేమో అనుకున్న నా సీత నాకు దక్కడమే కాదు, అప్పటికి నాకు సహచారిణి కూడా అయింది, అది మరో విషయం.

సీత రావడంతోనే పరాయతం చెప్పుకు రమ్మని నన్ను మా నాయనగారు కానూరు అగ్రహారం పంపించారు.

స్మార్తం చెప్పుకున్నవాళ్ళకి సంహిత అనావశ్యకం కాదు; గాని పరాయతం మాత్రం మిక్కిలీ అగత్యం.

సభకి వెడితే పరాయతం రాని స్మర్త నిలవ లేడు.

అదీ మా నాయనగారే చెప్పగలరు గాని; తీరిక లేదు.

అయినప్పుడే ఆయె అంటే, చాలాకాలం పడుతుంది, మరి.

అయితే మాత్రం కానూరు అగ్రహారమే యెందుకు పంపాలి అంటే, అక్కడ అది చెప్పదగిన సమర్థులు దొరికారు కనక.

అనుభవాలూ - జ్ఞాపకాలూను - 1

117