Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇదీ మా నాయనగారి తత్వం.

ఇలాంటి కారణాలవల్ల మా పితామహులు మా పెత్తండ్రిగారిమీద అభిమానం పెట్టుకున్నారు.

మరి ప్రయోజనం?

అది రుణాలు తీర్చలేకపోయింది.

ఇంటో యెప్పుడు కావలసిన వస్తువు అప్పుడు సమకూర్చలేకపోయింది.

దాంతో, వేరున్న వెంటనే, మా పెదనాయనగారు రుణాల తీరుమానానికి వొక్కొక్క భూమే అమ్మడం ప్రారంభించారు.

రుణబాధ మా నాయనగారికీ వుంది సమంగా; గాని వారు భూములు స్వాధీనతనఖాలు పెట్టడం ప్రారంభించారు.

ముప్ఫయ్యేళ్ళకి తక్కువ తనఖా నొక్కటీ లేదు.

అరవై యేళ్ళకిన్నీ వొక తనఖా వుంది.

పొలమూరిలో మా నాయనగారికి యకరంనర వచ్చింది.

అప్పటికే అది మాగాణి.

రత్నగర్భ.

మా పెదనాయనగారు, తమ వాటా యకరంనరా ఆరువందల రూపాయలకు తెగనమ్మేశారు. ఆరువందలే అప్పు పుచ్చుకుని అరవైయేళ్ళకి తనఖా పెట్టారు తమ వాటా, నూ నాయనగారు.

అది నేను పుట్టిన సంవత్సరం జరిగింది.

కనక, నాకు షష్టిపూర్తీ ఆ భూమి విడుదలా వొక్కమాటే.

చెప్పవచ్చిందేమిటంటే?

భూములన్నీ యిలా నిలుపుకుంటూ వచ్చారు కనక, లెక్కల్లో మా నాయనగారు ఆస్తిపరులే గాని; వ్యవహారంలో రెక్కలే ఆధారం అయినాయి.

ఇటు పూర్వపు మర్యాదలకు లోటు రాకుండా సంసారం నిర్వహించుకుంటూ, భూములు తనఖాపెట్టి, తీర్చిన రుణాలు తీర్చగా, డబ్బు సంపాదించి తీర్చవలసిన రుణాలున్నూ కొన్ని వుండిపోయాయి, మా నాయనగారికి.

దీనికి సాయం, మగ పిల్లలం ముగ్గురమూ, అడపిల్లలు ముగ్గురూ - ఆరుగురు సంతానం మా నాయనగారికీ.

వీరిని పెంచాలి, కార్యాలు చెయ్యాలి.

చదువులున్నూ చెప్పించాలి.

అయినా, మా నాయనగారి కెప్పుడూ యే లోటూ రాలేదు.

మాకందరికీ స్థితిపరులు చేసినట్టే శుభకార్యాలు చేశారు.

రోజులు రాజాంగంగా వెడుతున్నాయి.

ఈ స్థితిలో మా యింటో స్త్రీల మూలంగా కలతలు ప్రారంభం అయినాయి.

"వెంటనే విడిపోవలసిందే" అంటూ మా పెద్దన్నగారు ఆస్తిపంపకానికిన్నీ రాయబారాలు ప్రారంభించారు, అవ్యవధానంగా.

112

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి - 1