Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మరి, నన్నయ్య అలా యెందుకు రచించాడూ?

అతను సంస్కృతగ్రంథాలు చదవనివాడా, పోనీ?

తాను అనువదించిన వ్యాసభారతమున్నూ అక్కడక్కడ చిన్నచిన్న వచనా లుండినా, శ్లోకాలు వచ్చాటప్పటికి ప్రాయికంగా అధ్యాయాలన్నీ యేకవృత్తగ్రథితాలే గదా, ఈమా ర్పెందుకు చేశాడు అతను?

ఇది తెనుగుభాష సంప్రదాయమా?

ఏమోగాని, ఆ చిన్నతనంలో, భారతం ప్రారంభించినప్పుడు బండరా ళ్ళెక్కుతూ, జారిపడుతూ, మధ్యమధ్య చతికిలబడుతూ ముళ్ళడొంకల్లో నడుస్తున్న ట్టుండేది నాకు.

ఇప్పటికీ యిది నాకు తప్పని బాధా, తీరని సందేహమున్ను.

భారతంమీద విమర్శగ్రంథా లన్నవి వొకటి రెండు చూశాను తరువాత, తత్కర్తల కిది యోచించవలసిన విషయం అయినట్టు కనపడదు.

ఏవంచ, -

ఏమయినా, నేను భారతం చదవడం మానుకోదలుచుకోలేదు.

అయితే "హృత్కవిలి చేసుకోవలసిన గ్రంథం మొదటిమాటు చరచరా చదువుకుపోవాలి. రెండోమాటు విచారణ ప్రారంభం. అలా యెన్ని మాట్లు చేస్తే అంత మంచిది" - ఇది మా పెద్దన్నగారి సిద్ధాంతం, గ్రంథ పరిశీలనకు,

ఇది పురస్కరించుకుని భారతం చదివితే, యెవరికయినా నా బాధ అనుభవానికి వస్తుంది.

అయితే మాత్రం

“నా తెనుగుబాష నేను తెలుసుకోవాలి!"

ఇది నాకు దీక్ష అయింది.

ఈ దీక్ష యేకాగ్రమున్నూ అయిపోయింది.

దాంతో, నన్నీ బాధ దిగతియ్యలేక పోయింది.

కథపట్లు చూసుకుంటూ గబగబా చదువుకు పోయాను.

"శారదరాత్రు"లన్న పద్యం మాత్రం విడిచిపెట్టలేక చాలామాట్లు చదివి, వెనక్కి వచ్చేశా నప్పుడు.

ఏం?

అన్నిమాట్లు చదివితేగాని విడిచిపెట్టలేకపోడానికి, నన్నయ కవిత్వంలో అది వొక్కటేనా రసవంతం!

అది కాదు, మాట.

ధీరోదాత్తుడైన మహానాయకుడు, శాశ్వతంగా తెరలోకి పోతూపోతూ, రంగస్థలాన, కడసారంగా కనపరిచిన, జటిలాలైన హావభావాల సంపుటి వంటిది, ఆ పద్యం.

దాంతో, వొక నిండు వెలుగు కనుమరిగి పోతోంది.

దాంతో, వొక అవతారం అంతర్ధానం అయిపోతోంది.

దాంతో, వొక మహాయుగం అంతరించిన్నీ పోతోంది.

నన్నయ మరి గంటం పట్టడు.

అనుభవాలూ - జ్ఞాపకాలూను - 1

97