Jump to content

పుట:Annamacharya Charitra Peetika.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20 ‘వేంకటేశ్వరా యని పద్యాంతనంబోధన మున్నను నిందుఁ బ్రతిపద్యమును నలమేలుమంగాంబికా ప్రస్తుతిపరమే. కడపద్యములో కవికూడా అమ్మకు అలమేల్మంగకు పద్యశతకము చెప్పితిననెను-కనుక నిది యల మేల్మంగాంబికాస్తుతి శతకమే యనఁదగినది.

అన్నమాచార్యచరిత్రలో నన్నమయ కొండనెక్కునాఁటి కెనిమిదేండ్ల వాఁ డని యున్నదిగాని, దాని నుపనయనముచే ద్విజత్వము వచ్చిన దాదిగా నని యున్వయించుకొని యెనిమిదేండ్లవాఁ డని, మాతృ గర్భముననుండి పుట్టినదాది పదునాఱేండ్లవాఁ డని సరిచూచు కోవలెను. కొండనెక్కు నాఁటి కాతఁడు నంకీర్తనకర్త. పదునాఱవయేఁట స్వామిప్రత్యక్షమై సంకీర్తన రచనానుగ్రహము చేసినాఁ డని రాగిఱేకు మీఁద నున్నది.

త్రోవభాష్యకారులు

దేశాళం

గతు లన్ని ఖిలమైన కలియుగ మందును! గతి యీతఁడే చూపె ఘనగురుదైవము ||పల్లవి||

ఈతనికరుణనేకా యిల వైష్ణవులమైతి! మీతనివల్లనే కంటి మీతిరుమణి! యీతఁడే కా వుపదేశ మిచ్చె నష్టాక్షరమంత్ర! మీతఁడే రామానుజులు ఇహపరడైవము ||గతు|| 1

వెలయించె నీతండెకా వేదపురహస్యములు! చలిమి నీతండె చూపె శరణాగతి! నిలిపినాఁ డీతండెకా నిజముద్రాధారణము! మలసి రామానుజులే మాటలాడే దైవము ||గతు|| 2

నియమము లీతండెకా నిలిపెఁ బ్రపన్నులకు! దయతో మోక్షము చూపెఁ దగ నీతండె! నయమై శ్రీవేంకటేశునగ మెక్కీ వాకిటను! దయఁ జూచీ మమ్మునిట్టే తల్లిదండ్రి దైవము ||గతు|| 3 అన్న అధ్యా. 175 ఱేకు.