19
"అలమేలుమంగకు నాశుమార్గమున
సలలితంబుగ నొక్కశతకంబు సెప్పె"
తెలియక చెప్పుఁగాళ్ళతోఁ గొండ నెక్కుచు బడలి మోఁకాళ్ళ ముడుపు దగ్గఱ నన్నమయు వెదురుపొదక్రింద నొకబండపై మైమఱచి నిద్రించుచుండఁగా నలమేలుమంగాంబ దర్శనమిచ్చి యూఱడించి, చెప్పులు విడిచి కొండ నెక్కు మని తెలిపి దివ్యప్రసాదము ప్రసాదించి యూకలిదీర్చి యరుగుట, మెలకువగొని కళవళమంది యాతఁ డిది నిజమో కాదేమో యనిసంశయించి, కడకు నమ్మి యాశుకవితగా నమ్మవారి మీఁద శతకముచెప్పట జరిగినది.
చ॥ అరసెలు నూనెబూరియలు నౌఁగులుఁ జక్కెరమండెగల్ వడల్
బురుడలు పాలమండెఁగ లపూపము లయ్యలమేలుమంగ నీ
కరుదుగ విందువెట్టుఁ బరమాన్నశతంబుల సూపకోట్లతో
నిరతవినిర్మలాన్నముల నేతులసోనల వేంకటేశ్వరా!
ఉ॥ చొచ్చితిఁ దల్లి నీమఱుఁగు సొంపుగ నీకరుణాకటాక్ష మె
ట్లిచ్చెదొ నాకు నేఁడు పరమేశ్వరి యోయలమేలుమంగ నీ
మచ్చిక నంచు నీతరుణిమన్నన నే నిను గంటి నీకు నా
బచ్చెనమాట లేమిటికి బ్రాతివి చూడఁగ వేంకటేశ్వరా!
ఉ॥ యోగ్యత లేని కష్టుఁడ నయోగ్యుఁడ నన్నిటఁజూడ గర్భని
ర్భాగ్యుఁడ నీకృపామతికిఁ బ్రాప్తుఁడ నోయలమేలుమంగ నా
భాగ్యము నీకృపాగరిమఁ బ్రాప్యము కావు మటంచు సారె నీ
భాగ్యవతీశిరోమణిని బ్రస్తుతిచేసెద వేంకటేశ్వరా!
ఉ॥ అమ్మకుఁ దాళ్ళపాకఘనుఁ డన్నఁడు పద్యశతంబు సెప్పెఁ గో
కొమ్మని వాక్ర్పసూనములఁ గూరిమితో నలమేలుమంగకున్
నెమ్మది నీవు చేకొని యనేకయగంబులు బ్రహ్మకల్పముల్
సమ్మద మంది వర్ధిలుము జవ్వనిలీలల వేంకటేశ్వరా![1]
- ↑ దీనిని వావిళ్ళవారు ప్రకటించిరి.