Jump to content

పుట:Annamacharya Charitra Peetika.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

వేదాంతదేశికులు శ్రీవెంకటేశ్వరస్వామివారి గుడిఘంట యంశమున నవతరించి రని ప్రఖ్యాతి. మన యన్నమాచార్యులు స్వామి నందకము (ఖడ్గము) నంశమున నవతరించి రని ప్రఖ్యాతి. (చూ.10 పుట.)

బాల్యము

అన్నమాచార్యునకు బాల్యమునఁ దల్లిదండ్రులు వదినెయన్నలు పనులు చెప్పుటయు, భగవద్భక్తిపరాయణుఁడై యాతఁడు వానినిఁ జేయఁ జాలక చీకాకుపడుటయు జరిగెను. (చూ.11,12 పుటలు.) కుటుంబము వారి వలనఁ దాను జీకాకు పొందుటను సూచించు సంకీర్తనములు కొన్ని యన్నమాచార్య సంకీర్తనములలోఁ గలవు. అం దొకటి:

సామంతం

అయ్యో పోయం బ్రాయముఁ గొలము!
ముయ్యంచుమనసున నే మోహమతి నైతి ||పల్లవి||
చుట్టంబులా తనకు సుతులుఁ గాంతలుఁ జెలులు!
వట్టియాసలఁ బెట్టువారే కాక!
నెట్టుకొని వీరు గడు నిజ మనుచు హరి నాత్మఁ
బెట్టనేరక వృథా పిరివీకు లైతి ||అయ్యో|| 1

తగుబంధులా తనకుఁ దల్లులునుఁ దండ్రులును!
వగలఁ బెట్టుచుఁ దిరుగువారే కాక!
మిగుల వీరలపొందు మే లనుచు హరి నాత్మఁ
దగిలించలేక చింతాపరుఁడ నైతి || అయ్యో || 2

అంతహితులా తనకు నన్నలునుఁ దమ్ములును!
వంతువాసికిఁ బెనఁగువారే కాక|
అంతరాత్ముఁడు వెంకటాద్రీశుఁ గొలువ కిటు!
సంతకూటములయలజడికి లోనైతి ||అయ్యో || 3
                                     అన్న అధ్యా. 29, ఱేకు.