సంధిల్లుచు స్కాందం బన,
సింధువునకు కాల్వ లమరిచిన చందమునన్.[1]
ఆ సపాదలక్షగ్రంథ మీనా డెన్ని లక్షలవరకు పెరిగినదో పరిశోధకుల గురుతుకై తెలుపనైనది. మూలగూరమ్మ అనునొక దేవత కొండవీటి రెడ్లకుల దేవత. "ఈమె దేవాలయము గుంటూరుజిల్లా సత్తెనపల్లి తాలూకాలోని అమీనాబాదు గ్రామమందున్నది" (రెడ్డిసంచిక-పుట 69).
ఈనాటి మన పండుగలకు ఆనాటివాటికి భేదములేదు. కాని వాటి సూచనలలో కొద్దిపాటి విశిష్టతను చూపుటకై యుదహరింతును.
"చలి ప్రవేశించు నాగులచవితినాడు
మెఱయు వేసవి రథసప్తమీ దినమున
అచ్చసీతు ప్రవేశించు పెచ్చు పెరిగి
మార్గశిర పౌషమాసాల మధ్యవేళ
ఇండ్ల మొదలను నీరెండ నీడికలను
అనుగుదమ్ముడు నన్నయు నాటలాడు
అత్తయును కోడలును గుమ్ములాడు కుమ్ము
గాచు చోటికి మకరసంక్రాంతివేళ."[2]
తెలంగాణములో గరుడపంచమిని నాగపంచమి అని చేయుదురు. కృష్ణాది జిల్లాలలో పైన తెలిపినట్లుగా కార్తీక శుద్ధచవితినాడు సేయుదురు. వైష్ణవులు ఏకాదశిని పుణ్యదినముగా చేసుకొని, శైవులు శివరాత్రిని నిర్ణయించినట్లు కన బడును. తెనుగువారిలో దానిని ప్రచారము చేయుటకై శ్రీనాథునిచేత శివరాత్రి మహాత్మ్యమును వ్రాయించిరి. కాని, ఆ శివరాత్రినాడు ఇప్పటివలెనే జూదమాడుచుండిరని శివరాత్రి మహాత్మ్యములోనే వర్ణించినాడు.
దీపావళిని "దివ్వెలపండుగ" యనిరి.[3] నేటికిని తెలంగాణములో దీనిని "దివిలిపండుగ" అని యందురు. ఇప్పుడు మనలో ప్రతి పున్నమ కొక పేరు,