బ్రహ్మ గొనియాడి యిదె సాక పట్టుమనుచు
పరిణమించిరి యొండొండ తరుణులెల్ల"[1]
పై పద్యములో బిందించి అనునది నిఘంటువులలో లేదు కల్లుబిందెను అమ్మవారి కెక్కించుట (అనగా నైవేద్య మిచ్చుట) అని దీని యర్థ మని అనుకొందును. సాకపట్టుట అనునదికూడ నిఘంటువులలో లేదు. "సాకపోయుట" అని తెలంగాణములో నిప్పటికినీ అందురు. దేవత ముందట నిండుకుండ నీరుపోసి నైవేద్య మర్పించుటకు సాకపోయుట అని యందురు. కవి తెలంగాణమువాడనుట కిట్టి పదములు మరికొన్ని యీ కొరవి గోపరాజ కవి వాడినాడు. కాకతి యొక మూలశక్తి యని యీ కవియే యిట్లు తెలిపినాడు.
"ఆకడ నీతిశాస్త్రవిదు
డై గురువీడ్కొని యేగె వేడ్కతో
కాకతి మూలశక్తి గని
గా నొనరించిన పైడిచట్టునా
నేకశిలాభిధానమున
నెన్నిక కెక్కి ధరిత్రిలోన నే
పోకల బోనియట్టి సిరి
పుట్టిన యింటికి నోరుగంటికిన్[2]
ఇందు కాకిత అని కవి వాడినాడు. ఏకశిల ఓరుగంటి పేరే యని తెలిపినాడు. ఒంటిమిట్ట కాదని స్పష్టమైనది. శైవసాంప్రదాయక కథలు పెరిగేకొలది స్కాందపురాణము పెరుగుతూ వచ్చెను. స్థలపురాణాలను నిన్న మొన్నటివరకు గీర్వాణములో వ్రాసి అది స్కాందపురాణములోని అముక ఖండములోని దని వ్రాసినవారు కలరు. శ్రీనాథుని కాలములో స్కాందపురాణ విస్తీర్ణ మిట్లుండెను.
క. బంధురసపాదలక్ష
గ్రంథంబై, యైదుపదులు ఖండంబులతో