పుట:Andrulasangikach025988mbp.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రచురణము)లో లక్ష్మీవిష్ణువులు నెత్తమాడినట్లు తత్కవి మూడు పద్యాలలో వర్ణించినాడు.

ఈనాడు పిచ్చుకుంట్లవారు పగటివేషాలు వేయుచుందురు. హిందూస్థానములో దీనిని "బహురూపులు" అందురు. ఈ వేషాల వినోదము కాకతీయుల కాలమందుండెను.[1]

పిల్లలాటలుకూడ విశేషముగా నుండెను. వయసు కోడెగాండ్రు పికిలి పిట్టల పోట్లాటలతో వినోదించిరి. బొటన వ్రేళ్ళపై పికిలి పిట్టలను తీసుకొని పోవుట వారికి పరిపాటి.[2]

పల్నాటివీరుడగు బాలచంద్రుడు పెక్కాటల నాడెను.

        "గుమ్మడికాయలు కొంతసేపాడి"
        "చెరుకులపందెంబు చెల్వొప్ప గెలిచి"
        "పోకలాటలచేత బుచ్చు ముప్రొద్దు"
        "ఆడుడి ముత్యంబు లమరు బంతులును"
        "గుంతమాపల నాడి కొని గెల్చికొనుము"
        "కుటిలజంతుల దెచ్చి గుడిలోన నుంచి"
        "విడిపించి పోరాడు విధమును జూడు"
        "రూకలకుప్పలు రూఢిగ నాడు."[3]

గుంతమాపలన ఒకపలకలో కొన్నిగుంతలుచేసి అందు చింతగింజలు పోసి ఆడు ఆటయై యుండును. ఈపదము నిఘంటులలో లేదు. బంతులు అన కాలిబంతి (పుట్ట చెండు) ఆటయై యుండును. జంతువుల పోట్లాట లన పొట్లేండ్ల పోరితము, కోళ్ళపందెము, పికిలిపిట్టల కలహము, దున్నల యుద్ధము అయి యుండును. తక్కినయాట లెట్టివో తెలియదు. కచ్చకాయలను తిత్తులలో నుంచుకొని వాటితో ఆడుచుండిరి.[4]

  1. "దైవంబనగ లేదు తా బహురూపు" బసవపురాణము పు. 20.
  2. "కరములపైని పికిలిపిట్టలు నుండ" పల్నాటివీరచరిత్ర పు 28.
  3. పల్నాటి. పు 38.
  4. పల్నాటి వీరచరిత్ర పు. 45.