పుట:Andrulasangikach025988mbp.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిత్రలేఖనము

మన పూర్వులకున్న కళాదృష్టి మనలో కానరాదు. చిలుకనో పువ్వునో చెక్కని చెంబు బోడిచెంబే! అంచులేని యుడుపుల ధరించుట అమంగళమని తలంచిరి. ఇండ్ల గోడలపై చిత్తరువులు వ్రాయిస్తూవుండిరి. ద్వారముల చౌకట్లపై చక్కని జంత్రపుపని యుండెడిది. బట్టలపై అద్దకముతో బొమ్మలను వేయుచుండిరి. ధనికులు పటములను వ్రాయించెడివారు. కాకతీయుల కాలములో చిత్తరువులు జనసామాన్యమందును ఆదరణీయముగా నుండినట్లు కానవచ్చును. ఇండ్లముంగిళ్ళలో మ్రుగ్గులతో చాల చక్కని చిత్రములను పడుచులు తీర్చు చుండెడివారు. ప్రతాపరుద్రుని యుంపుడుగత్తెయగు మాచల్దేవి యింటి నెట్లలంకరించినదో గమనించుడు.

       "చందనంబున కలయంపి చల్లినారు
        మ్రుగ్గు లిడినారు కాశ్మీరమున ముదమున
        వ్రాసినా రిందు రజమున రంగవల్లి
        కంజముల దోరణంబుల గట్టినారు"[1]

ఎందుకనగా, మాచల్దేవి "చిత్రశాలా ప్రవేశంబు చేయుచున్నయది. పుణ్యాహవాచన కాలంబు."= ఏవిధమగు చిత్తరువులు వ్రాయుచుండిరో అవియు తెలియవచ్చినవి. దారుకావనములోని శివుడు, గోపికాకృష్ణులు, అహల్యా సంక్రందనులు, తారా చంద్రులు, మేనకా విశ్వామిత్రులు మొదలైనవి వ్రాయిస్తూ వుండిరి. చిత్తరువులను 'మయ్యెర'తో వ్రాసిరి. (మయ్యెర అను వెంట్రుకలతో చేసిన బ్రష్షు అయి యుండును - మైర్ అన అరవములో వెంట్రుక అని యర్థము). ఓరుగల్లున 'చిత్తరువులు వ్రాసే యిండ్లు 1500' అని ఏకామ్రనాథుడు వ్రాసెను. భోగమువారు తమకు తగిన పటాలను వ్రాయించుకొనిన ఇతరులును వ్రాయించుకొన్న వారు కారు. ప్రజలు తమతమ అభిలాషల కొలది వ్రాయించుకొను చుండిరి. వీర పూజ కోరువారు వీరుల చిత్రాలు వ్రాయించిరి.

  1. క్రీడాభిరామము.