పుట:Andrulasangikach025988mbp.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ననియు నేనే వ్రాసితికదా! "సిద్ధం నమ:" అనునది జైనులనుండి వచ్చియుండు ననియు వ్రాసితి. గాథా సప్తశతిలో 2 వ శతకములోని 91 వ శ్లోక మిట్లున్నది

      "వర్ణావశీమప్యజానంతో లోకాలోకై ర్గౌరవాభ్యధికా:
       సువర్ణ కారతులా ఇవ నిరక్షరా అపిస్కంధైరుద్యంతే."

దీనిపై సాహిత్యాచార్య భట్ట శ్రీ మధురానాథశాస్త్రిగారు (జయపూర్) ఇట్లు వ్యాఖ్యానించిరి. "జనై: ఓం నమ: సిద్ధం సిద్ధిరస్తు" ఇత్యారభ్యాం వర్ణమాలా మప్యజానంతో లోకా: గౌరవాభ్యధికా: పరమాదరణీయా ఇతి కృత్వా నిరక్షరా అపి నిర్విద్యా అపి సువర్ణకారతులా ఇవ స్కంధై రుద్యంతే సాదరం నీయంత ఇత్యర్థ: సాహిత్యాచార్యులు కూడ "ఓం నమ: సిద్ధం" అని జనులు విద్యాభ్యాసారంభమున చేయుదురన్నారు కదా: అట్లనుటకూడ తప్పందురా యేమి ఆక్షేపకులు!! సాహిత్యాచార్యులు ఉత్తర హిదూస్థానమువారు. వారు 'సిద్ధం నమ:' అను దేశాచారమును తెలుపుటచేత అది తెనుగువారిలోనే కాక ఇతర భారతీయ భాషలలో కొన్నింటియందుకూడా ఉండె ననుకొనవలెనో లేక గాథాసప్తశతి దక్షిణదేశ కవిత కాన దాక్షిణాద్యాచారమని వారు భావించి వ్యాఖ్యానించిరో తెలుపజాలము.

మొత్తానికి తప్పో ఒప్పో ఆపాణినీయమో, అపాతంజలీయమో దేశ మంతయు తప్పునే వాడిన అ వాడుకను పాణినీయాది సిద్ధాంతములు కొట్టివేయ జాలవు. భాష మారేకొలది వార్తికములు, భాష్యములు పుట్టవలసి వచ్చెను. అంతేకాని ఒకరి శాసనాలకు భాష కట్టుబడి యుండదు. ఈ లెక్క చొప్పున "సిద్ధం నమ:" అను దానిని సరియైనదిగా నంగీకరింప వలసి యుండును. ఇట్టి కృత్యాద్యవస్థ మన పిల్లల కీనాడును తప్పినదికాదు.

కాకతీయుల కాలమందే తిక్కన సోమయాజి, అతని శిష్యుడగు మారన. కేతన, మంచెన, గోన బుద్ధుడు, పాల్కురికి సోమనాథుడు, భద్ర భూపాలుడు, రావిపాటి తిప్పన్న, నాచన సోముడు, భాస్కరుడు, మల్లికార్జున పండితారాధ్యులు మున్నగు మహాకవు లుండిరి. అదే విధముగ సంస్కృతమందు అగ్రశ్రేణికి చెందిన పండితకవు లుండిరి. అందు విద్యానాథుడు ప్రఖ్యాతుడు (కవి పండితులను గూర్చి వివరించుట కవుల చరిత్రగా మారునని సూచించి వదలి వేయబడినది).