పుట:Andrulasangikach025988mbp.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వాడుకలో నుండెను. పాలెమును (సీమను) రక్షించువారు పాలెగార్లు. వారిసేనలో మాలమాదుగలు విశేషముగా నుండిరి. నేటికిని మాలమాదుగుల ఇండ్లపేళ్ళలో పింజలవారు, తప్పెటవారు, కొమ్మువారు, కఠారివారు అను పేరులు వారి పూర్వపుజాడలను తెలుపుతున్నవి.

శైవమందు చాకలి, మంగలి, మాల, మాదిగ మున్నగు జాతుల వారందరును కలిసిరనుటకు పాల్కురికి సోమనాథ బసవపురాణమం దనేక నిదర్శనములు కలవు. ఇప్పటి కాలములో సత్రభోజనములు బ్రాహ్మణులకే ప్రత్యేకింపబడినవి. కాకతీయుల కాలమున కొన్ని తావులలో అన్ని వర్ణముల వారికిని భోజనములు పెట్టుచుండిరి. శైవ సాంప్రదాయానుపరణముగ చండాలురకుగూడ అన్న వస్త్రదానములను సత్రములం దేర్పాటు చేసియుండిరి.[1]

ప్రతాపరుద్రుని కాలమువాడగు ఏకామ్రనాథుడు తన వచన ప్రతాప చరిత్రములో నిట్లు వ్రాసెను.

"మరియు నొక్కనాడు సంతూరను గ్రామంబున కృష్ణమాచార్యుల తమ్ము డనంతాచార్యులు రజకస్త్రీతో
గూడెను. ఆ రజకు డిద్దరిని బొడిచెను. అంత వారు మరణించిరి. అ పురి విప్రులది. శూద్రపీనుగుతో
గూడియున్నది కనుక మేము మొయ్య మనిరి. అది విని కృష్ణమాచార్యులు తనమదిని విచారించి,
వాసుదేవ మూర్తిని కీర్తించెను. శవంబు దనంతట తాను కాష్ఠంబువరకు జరిగిపోయెను."

వీరశైవులును వైష్ణవులును కొంతవరకు సంఘసంస్కర్తలే కాని వారు అసహనమున, మతోన్మాదమును హిందూసంఘమందు ప్రవేశపెట్టినవారైరి. జనులలో మూడభక్తి యెక్కువయ్యెను. ఇది మతమును గూర్చిన చర్చ.

ఇక యితర విషయములనుగూర్చి తెలుసుకొందము.

యుద్ధ తంత్రము

హిందువులలో శౌర్యసాహసా లుండెను. కాని యుద్ధపరికరములను వారు కనిపెట్టినది తక్కువయే. క్రొత్త మేలైన మారణయంత్రాలను తురక లుపయోగించిరి. తర్వాత యూరోపువారు మనపై యుపయోగించి దేశమును

  1. మల్కాపురశాసనము (తెలంగాణా శాసన గ్రంథము.)