పుట:Andrulasangikach025988mbp.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కలవు. ఈ లెక్క చొప్పున తెలంగాణములోనే జైనమత వ్యాప్తి యెక్కువగా నుండెను.

కాకతీయుల కాలములో జైన, శైవ, వైష్ణవ మతములు పరస్పర ప్రాబల్యవ్యాప్తులకై పోరాడుచుండెను. మూడింటిలోను కులభేద నిర్మూలనము ఒక సామాన్యధర్మముగా వ్యక్తమవుతున్నది. కవిత్రయమువారే ఒక విధముగా తెనుగుదేశమందలి వర్ణాశ్రమాచార స్థిరతను నిలబెట్టుటకు ప్రచారము చేసిన వారనవచ్చును. నన్నయభట్టు భారతము బ్రాహ్మాణాధిక్యతను ప్రచారముచేసెను. తిక్కన యజ్ఞదీక్షితుడై కుండలీంద్రుడయ్యెను. బుధజనవిరాజి సోమయాజి యయ్యెను. కాని, కాకతీయయుగములో మాత్రము వారిప్రచారము జైన, శైవ, వైష్ణవ ప్రవాహములో కొట్టుకొనిపోయెను. ఈ మూడు మతాలవారును సంఖ్యా బలమును సమకూర్చు కొనుటకు యథార్థముగా ఆర్యజాత్యైకత కవసరమగు కులతత్త్వ నిర్మూలనముచేసి, సర్వవర్ణముల వారిని ఏకవర్ణముగా మార్చ ప్రచారముచేసిరి.

మొదట జైనమతవ్యాప్తి హెచ్చుగా నుండెను. ఓరుగంటి ఆది రాజులు జైనులు. అప్పుడు బసవేశ్వర నాయకత్వమున బిజ్జులుని కల్యాణి రాజ్యమందు తలయెత్తిన వీరశైవ ఝూంఝూమారుతము తెనుగడ్డపైకి వీవదొడగెను.

     "ఒకనాడు శివభక్తు లోరగంటను స్వయం
             భూదేవు మంటపమున వసించి
      బసవపురాణంబు పాటించి వినువేళ
             హరుని గొల్వ ప్రతాపు డచటికేగి
      ఆ సంభ్రమం బేమి యనుడు భక్తులు బస
             వని పురాణం బర్థి వినెద రనిన
      విని యా పురాణంబు విధ మెట్లొకో యన్న
             ధూర్తవిప్రు డొకండు భర్తజేరి

      పాలకురికి సోమ పతితు డీనడుమను
      పెనచె మధ్యవళ్ళు పెట్టి ద్విపద
      యప్రమాణం బిది యనాద్యంబు పదమన్న
      నరిగె రాజు, భక్తు లది యెరింగి."