పుట:Andrulasangikach025988mbp.pdf/385

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

          కుప్పె, రాగడిబిళ్ళ కుంకుమరేఖ
          పాపటబొట్టు కమ్మలు, బావిలీలు,
          లలిసూర్య చంద్రవంకలు, సూసకము,
          కెంపు రవలపల్లెరుబూవు, రావిరేక,
          బుగడలు, నాన్‌దీగె, సొగసైన మెడనూలు
          కుతికంటు, సరపణ, గుండ్లపేరు,
          సరిగె, ముక్కర, బన్నసరము, లుత్తం
          డాలు కంకణంబులు, తట్లు, కడియములును
          సందిదండలు, ఒడ్డాణ మందమైన
          ముద్రికలు, హంసకంబులు, మ్రోయుగజ్జె,
          లలరు బొబ్బిలకాయలు గిలుకు మెట్టె
          లాదియగు సొమ్ముదాల్చి యయ్యబల మెరయు (2-391)

మన పూర్వుల ఆటలవలెనే సొమ్ములున్నూ చాలావరకు మనకు తెలియరానివై పోతున్నవి. అభిమానులు వాటిని వర్ణించి చిత్రింపజేసి తెలుపుట మంచిది. ముఖ్యముగా నిఘంటుకారులు ఇట్టి పదాల కర్థము వ్రాయునప్పుడు భూషణవిశేషణము అని వ్రాయుచుండిరి. అంతమాత్రమందరికిని తెలియును. ఇక నిఘంటుకారు లొనర్చిన ఘనకార్యమేమి?

ఏనుగుల వీరాస్వామయ్య అనువారు మద్రాసులో పెద్దఉద్యోగమందుండినవారు. అతని కాలములో ఇంకా రైళ్లు ఏర్పడి యుండలేదు. అతడు మద్రాసు నుండి కాశీకి సకుటుంబ పరివారముగా ప్రయాణము చేసి పల్లకీలో క్రీ.శ. 1830-31లో ప్రయాణము చేసెను. అతడు కడప, కర్నూలు, జటప్రోలు వనపర్తి, పామూరు, హైద్రాబాదు, నిజామాబాదు మీదుగా కాశీచేరి తిరుగా ఉత్తర సర్కారుల తీరము మీదుగా మద్రాసు చేరుకొనెను. కాన ఇంచిమించు తెనుగుసీమలో ముఖ్య భాగాలన్నింటినీ అతడు చూచి, అందలి జనుల ఆచార వ్యవహారాలను ఉన్నవున్నట్లుగా తన డైరీలో వ్రాసుకొనెను. అందుచేత అతని 'కాశీయాత్ర చరిత్ర' మన సాంఘిక చరిత్రకు క్రీ.శ. 1800 - 1850 కాలము వరకు చాలా ఉపకరించును.

వీరాస్వామి కాలములో తెనుగుదేశము ఇంగ్లీషువారి పరిపాలన లోనికి వచ్చెను. హైద్రాబాదులోని తెలంగాణా నిజాం పరిపాలనములో ఉండెను.