మెలిగొన జుట్టిన తలపాగ చెరగుంచి
పై లపేటా చుట్టు పట్టుశాలు
కడిమి మీరగ చంకనిడిన బొట్టియకోల
డాక మ్రోసెడు డుబుడుబుక్క కేల. (2-28)
తాటాకులపై గంటములతో వ్రాయుట 100 యేండ్ల క్రిందటి వరకు మనదేశమందు విరివిగా ప్రచారమందుండినను శ్రీనాథుని కాలము వరకే కాగితాలపై మసితో వ్రాయు ఆచారము ప్రారంభమై యుండెను.
'దస్త్రాలున్ మసి బుర్రలున్ కలములున్
దార్కొన్న చింతంబళుల్'
అన్న శ్రీనాధుని చాటువునుండి పై విషయము విశదమయినది. హంసవింశతి కాలములో 'దవతి', 'శాయి' మరింత వ్యాప్తిలోనికి వచ్చెను.
రసికుడైనట్టి కాలంపు రక్తవాను
తనర బ్రహ్మాండమును పెద్ద దవతిలోన
శాయినిండార బోసిన చందమునను
కారుతిమిరంపు గుంపు నిండారబర్వె.
(దవతి యనునది దవాత్ అను ఫార్సీ పదము; మసిబుర్ర అని యర్థము శాయి అనునది సియామ్ అను ఫార్సీ పదము. నల్లనిరంగు అని యర్థము. ఈ రెండు పదాలను తెలంగాణా వారు విశేషముగా వాడుచున్నారు.)
హంసవింశతిగ్రంథాదిలోనే నానావిధములగు ఉపాహారములను భక్ష్యములను పిండివంటలను, చిరుతిండ్లను బేర్కొన్నాడు. అదొక పెద్ద పట్టిక యగుటచే ఉదాహరించుటకు వీలులేదు. (1-105)
ఇంకా గంటలుచూపు పాశ్చాత్య గడియారములు వచ్చి యుండలేదు. హంసవింశతికారుని కాలములో విజ్ఞులు ఎండలో పాదచ్ఛాయను కొలిచి కాలమును గుర్తించుచుండిరి. పెద్దపెద్ద పట్టణములలో గడియలను కొట్టు ఏర్పాటుండెను.
'అస్తమయము కాదటంచు పాదచ్ఛాయ
లొనరించి వ్రేళ్లెంచికొనుచు