పుట:Andrulasangikach025988mbp.pdf/375

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

           "దంతలూటీ ఘోరదంతి హర్యక్షంబు
            కుష్ట రోగాచల కిలిశధార.......

మొదలగు పద్యాలను చూచిన విశదమగును.

(చూడుడు చాటుపద్యమణిమంజరి. పుటలు 190 - 192) భాషీయ దండకమును రచించిన కవి గండ్లూరి నరసింహ శాస్త్రి క్రీ.శ. 1800 ప్రాంతములో కర్నూలు మండలములో ఉండినట్టివాడు. అప్పటి జనుల ఆచార వ్యవహారములను చక్కగా ఈ దండకము విశదీకరించును. నంబి యెదురువస్తే పనిచెడుతుంది అని జనుల విశ్వాసము నాటికి నేటికి కలదు. అదే మాటను ఇతడిట్లు చెప్పినాడు.

       'తొల్త పెండ్లిండ్లకున్ తర్లి పొయ్యేటి వారందరున్
        ముందుగా మమ్ము ప్రార్థించు చున్నారు మమ్మెందు
        సేవించి కార్యార్థులై పోయినా వారి కాపొద్దు
        వైకుంఠ యాత్రాసమంబైన సౌఖ్యంబు సిద్ధించు'

పొగాకును చుట్టగా త్రాగుటయేకాక పొగాకుకాడ పుల్లలను పొగాకు మొద్దుల చూర్ణాన్ని కర్నూలు కడపలోని పనిపాటలవారు నోట్లో వేసుకొను ఆచార మిప్పటికినీ కలదు. ఈ కవి యిట్లు వర్ణించినాడు.

       ఇంగ గొల్లేశ మొస్తుంది నోట్లోకికొంచెం పొగాక్పుల్ల గిల్పెట్టి........పోరా
       పొగాక్పుల్ల కేయాడ కొట్టించుకొంటావురా బాలకిన్నేశగాడా యటంచున్ వినోదంబుగా

       గూడెపున్ దాసరుల్ గుంపుగూడాడగా'

రాయలసీమలో పిల్లలపద్యాలు కొన్ని ప్రసిద్ధిగా నుండి యుండును. వాటి మొదటి పాదము మాత్రము కవి యిట్లు సూచించినాడు:

           "చెప్పాలవో చెప్పితే లడ్డులప్పాల్ గొని
            త్తావుగా" - 'శేతిలో యన్నముద్దొత్తు,'
            "శంగల్వ పూదండ" సెప్పేమరి

ఆ పిల్లవాడిట్లన్నాడు "చేతిలో వెన్నముద్ద" అను పద్యము నాకు వచ్చును. "చెంగల్వపూదండ" అనేది నీవు చెప్పుము. "చేతిలో వెన్నముద్ద-చెంగల్వపూదండ" అన్న పద్యమును వృద్ధు లీ విధముగా తెలిపినారు.