పుట:Andrulasangikach025988mbp.pdf/374

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాయలసీమవారు గోంగూర అనరు; పుంటికూర అందురు. ఉల్లిగడ్డ తినిన బ్రాహ్మణులు దానిని బయట పెట్టుకొనరు!

                       "కలిసి షికారునెపంబున"

అని షికారు పదమును వాడుటచే ఇతడు స్పష్టముగా ఉత్తరసర్కారు వాడని తేలిపోయినది.

        "ప్లీడరులమని వకీళ్ళీ వాడుక చెడ స్వేచ్చ దిరిగి పాడు మొగములన్
         గూడనివారిం గూడుచు గూడెముల జరింత్రుముందు గువ్వలచెన్నా!'

        'ధనమైనంతట భూముల తనఖాలను విక్రయములు తరువాత సతీ
         మణిభూషణాంబరమ్ములు గొనుట యవి లక్షణములు గువ్వలచెన్నా!'

అను పద్యములోని ప్లీడరు పదముచేతను భూమి తనఖాలు (మార్టుగేజ్) అను పదముచేతను కవి క్రీ.శ. 1800 - 1850 ప్రాంతము వాడని స్పష్టము. కావున ఈ కాలములోని ఆంధ్రుల స్థితిని ఈ శతకము కొంతవరకు మనకు తెలుపుచున్నది.

         అంగీలు పచ్చడంబులు సంగతిగను శాలు జోడు సరిగంచుల మేల్
         రంగగు దుప్పటులన్నియు గొంగడి సరిపోలవన్న గువ్వలచెన్నా!

అంగీలు బాగా వ్యాప్తిలోనికి వచ్చెను. కాని గొంగడిని మరచిపోవద్దని చెన్నడు బోధిస్తున్నాడు.

        అల్పునకు నెన్ని తెల్పిన బొల్పుగ నిల్వవని పేడబొమ్మకు నెన్నో
        శిల్పపుబను లొనరించిన గోల్పోక యలారుచున్నె గువ్వలచెన్నా!

పేడబొమ్మల పరిశ్రమ మన వారికి ప్రాతదే. ఇంకా ఇంగ్లీషు బొమ్మలు దిగుమతి కాలేదన్నమాట.

జనులలో మొగలాయి వేషాలు పోయినవని కవి విచారపడినాడు.

       పాగా లంగరకాలును మీగాళ్ళనలారం బంచె మేలిమికట్టుల్
       సాగించు కండువాల్పయి కోగా యిక గానమెన్న గువ్వలచెన్నా!

క్రీ.శ. 1600 - 1750 లో క్రమక్రమాభివృద్ధిగా దేశమందు వ్యాపించి పోయిన పొగాకు ఈ సమీక్షా కాలములో మరింత వృద్ధికి వచ్చెను. కవులు దాని యశోగానము చేసిరి. అనేక చాటువులు బయలుదేరెను.