"కుక్క గఱచెనేని కూయనీయక పట్టి
ప్రక్కవిరుగదన్ని పండబెట్టి
నిమ్మకాయదెచ్చి నెత్తిన రుద్దిన
కుక్క విషము దిగును కుదురు వేమ."
నేడుకూడా పిచ్చిలేచినవారికి నెత్తి గొరిగించి, కాట్లు పెట్టించి, ఆ కాట్లలో నిమ్మరసముతో బాగుగా మర్దింతురు.
"కాంతసిందురంబు కడు పిత్తరోగికి
ఒనర మధువుతోడ నొసంగినంత
తనదు దేహబలము ధన్యుడై గట్టెక్కు ॥
విశ్వ॥
ఉక్కుకళ్ళు దిన్న నొగి తేటగా నుండు
ఉక్కుచూర్ణము దిన మడుగు క్షయము
ఉక్కుకళ్ళకన్న నుర్వి కల్పము లేదు ॥
విశ్వ॥
ఉక్కు శుద్ధిచేసి యుంచి తినెడు వాడు
ఉక్కుదిటవువలెనె యుండు జగతి
ఉక్కుచూర్ణము దిను టొప్పగు కల్పంబు ॥
విశ్వ॥
ఈ పద్యాల శైలిని చూడగా ఇవి వేమనవని నమ్మను. ఇక పశువైద్య మానా డెట్లుండెనో ఈనాడును అట్లే కలదు.
దొమ్మమాయుకొరకు అమ్మవారికి వేట
లిమ్మటండ్రిదేమి దొమ్మతెవులొ
అమ్మవారిపేర నందరు తినుటకా ॥
వి॥
వేమన కాలములో గాజు కుప్పెలు (Glass) చేయుచుండిరేమో! 'గాజు కుప్పెలో వెలుగుచు దీపంబు' అనుటచే ధనికులు గాజు గిన్నెలలో దీపాలు వెలిగించుచుండిరని యూహింపవచ్చును. శ్రీనాథుడు తన భీమేశ్వర పురాణములో 'గాజుకుప్పెల గస్తూరికా జలంబు | కర్ణికారాంబ పైనించె గర్ణమోటి' అని వర్ణించెను.
చంద్రశేఖర శతకము రచించిన కవి యెవ్వరోకాని బ్రాహ్మణు డని మాత్రము తోచును. అతడు నెల్లూరివాడని భాషనుబట్టి స్పష్టమగుచున్నది.