'ఆన మాయప్పు లీకపోతేని యనుచు
ధరణి పంపున తొలుకారు తరువుకాడు
నింగి గుడివ్రాసియాగిన భంగినపుడు
చండకరుడుండె పరివేష మండలమున!'[1]
దొంగలను పట్టి "బొండకొయ్య" నుంచెడివారు.[2] రెండు పలకల తొలచి అందు రెండు కాళ్ళను పెట్టించి ప్రక్కలలో కట్టెకొయ్యను దిగగొట్టుదురు. అటులే చేతులకును తగిలింతురు. వాటిని బొండకొయ్య లందురు.
ముత్తైదువగా చనిపోవుటను "కడియంపు చేమీదుగాగ దివముసేరుట" యనిరి.[3] అనగా ముత్తైదువగా చనిపోయెనని యర్థము. నేటికిని రెండవభార్యను చేసుకొన్నప్పుడు ఆమెకు "సవతికడెము" అని యొక సన్నని కడెమునకు రెండు చుక్కలు పెట్టి ఆమె కుడిచేతికి పెట్టుదురు.
నంబులు గుడిపూజారులై జీవించిరి. గుళ్ళలో గన్నేరు పూవులు సమృద్ధిగా పెంచి వాటిని సంపన్నుల యిండ్ల స్త్రీలకిచ్చి ప్రతిఫల మందెడివారు. "ఊరినంబికి మోహ మూరించి తెప్పించి పూను మాపటి వేళ పూవుటెత్తులు",[4] "నరసిన సిగలోన నంబివాడిచ్చిన గన్నేరు పూవులు కొన్ని తురిమి" [5] అనుటచే నంబులవృత్తి కొంత తెలియ వస్తున్నది.
యతుల జీవనము లిట్లుండెను:-
'త్రిషవణస్నానములు నిష్టదేవపూజ
గ్రంథపారాయణము పరబ్రహ్మచింత
భైక్షభుక్తి హరీతకీ భక్షణంబు
ఆజిన శయనంబు గల్గి యయ్యతి వొసంగు.'[6]