ఓలియిచ్చు యాచారముండెడిది. ఒక కోమటి తన భార్యకై 100 మాడల ఓలి నిచ్చితి ననెను[1] శూద్రులలో సాధారణముగా 10 మాడల ఓలి యుండెను. (శుక. 3-137)
అంగమర్దనము చేసి జీవించెడివారు కొందరుండిరి:-
కూలికి నూనెలంటి కల గూరలకై పొలమెల్ల జుట్టి పా
ల్మాలక యాత్మ బంధుజనులం దరియం జని ప్రాతబట్టకై
కూళతనంబునన్ ప్రభులకుం దనుమర్దన మాచరించుచున్
వ్రాలుడు ప్రొద్దుతోడ గృహ వాటికి జేరు నతండు నిత్యమున్."[2]
ధనికులు తివాసీలపై కూర్చొనెడివారు. (శుక. 1-262) బురునీసు దుప్పటులు కప్పుకొనెడివారు, (శుక. 2-265) (బురునీసు పదము నిఘంటువులలో లేదు. మెత్తని మేలైన ఉన్ని కంబడిని బురునీసు అందురు. తెలంగాణాలోని కొన్ని తావులలో ఈ పదము వాడుదురు.)
వ్యభిచారము, చిన్నజాతులతో భుజించుట, బాందవ్యము చేయుట, దొంగతనము మున్నగు తప్పులకు కులంతప్పు పెట్టెడివారు.[3] యుద్ధము చాలించుటకు, సంధిచేసుకొనుటకు ఓడినవారు 'ధర్మధార' పట్టెడివారు. అనగా కొమ్మూదువారు. అంత ఉభయవర్గాలు యుద్ధము చాలించెడివి. క్రీడాభిరామములో వలెనే శుకసప్తతిలో 'విరహిజన మథనంబు మనసిజుండు పట్టించు ధర్మధారోదయంబును బోలికుక్కుటారవంబున అరుణోదయం బగుట యెరింగి'[4] అని వర్ణించినారు.
అప్పులవారని పొగడదండలతో శిక్షించిరి. (శుక. 2-16). దీనిని గురించి యిదివరలో చర్చింపనైనది. మరియు అప్పుల పోతుల నిలబెట్టి చుట్టూ గీతగీసి అప్పు చెల్లించువరకు ఆ గీటును దాటరాదని అప్పిచ్చినవారు శాసించెడి వారు.