పుట:Andrulasangikach025988mbp.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆచారము తెనుగువారిదే. అర్జునుడు సుభద్రను "తన మేనమరదలి ధవళాక్షి దోడ్కొని చనియె" (ఆది. 8-208) సంస్కృత భారతములో లేనివియు, తెనుగులో హెచ్చుగానుండు విషయములే భారతోదాహరణములం దంతటను గ్రహింపబడుతున్నవని యెరుగవలెను.) స్త్రీలు మట్టెలు ధరించుట తెనుగువారి యాచారమే వైదిక పద్ధతిలో లేదు. "లలితంబులగు మట్టియల చప్పుడింపార నంచకై వడి నలనల్లవచ్చి" (విరాట 2-64) అనుట యిందుకు ప్రమాణము. నన్నయ తిక్కన్నల కాలములో పురుషులుకూడ మట్టియలను కాలివ్రేళ్ళకు పెట్టుకొనుచుండిరి. నేటికిని అందందు సకృత్తుగా కొందరు పురుషులు మట్టెలను పెట్టుకొనుట కాననగును. కీచకుడు నర్తనాగారమునకు పోయినప్పుడు "మట్టియ లౌండౌంటి బిట్టు దాకగనేల నందంద మునిగాళ్ళ నప్పశించుచు" పోయెను (విరాట 2-250). వధువును పెద్దలు చూచుట, బాంధవ్యము నిశ్చయించుట, అట్టి 'నిశ్చితార్థములో' కన్యకకు "ముద్రారోహణము" చేయుట అనగా తలపై పేలాలుంచుట ఆ కాలమందలి తెలుగువారి యాచారమై యుండును.

(కుమా.7-139) పెండ్లియైన తర్వాత బంధువులు రంగులతో వసంతమాడుట నేటికిని విరివిగా జరుగు ఆచారమే. నన్నెచోడుని కాలమందును అట్టి వసంతము లాడుచుండిరి. "తనరారు క్రోళ్ళను (క్రోవిచిమ్ముడుగొట్టము) నొత్తు కుంకుమారుణాకీర్ణజలధార లమరె", "వరచందన పంకమున దిరముగ ముద్రాటలాడిరి." "ఆవనీరు" చల్లుకొనిరి. (కుమా. 9-59 మరియు, 60 మరియు 67) భటవృత్తిలోనుండు కులాలలోను అంతతక్కువ కులాలలోను విడాకులిచ్చు ఆచారముండెను. "నేడాలము చేసి నన్ను పెడయాకులబెట్టె మన:ప్రియుండు" (కుమా. 11-55) అని ఒక యుద్ధభటుని భార్య వాపోయెను.

వివాహములకు సంబంధించిన అవైదిక దాక్షిణాత్యాచారములను సోమేశ్వరదేవు డను పశ్చిమ చాళుక్యరాజు క్రీ.శ. 1130 లో తన అభిలషితార్థ చింతామణిలో సంస్కృతమందు చక్కగా వివరించెను. ఆ రాజు కర్ణాటకుడైనను అతడు తెలిపిన యాచారములు తెలుగువారిలోను ఉండినందున ఆ గ్రంథము మనచర్చకు చాల యుపయోగకారి. అతడిట్లు తెలిపినాడు: "వివాహమంటపమును తోరణములతో, పుష్పములతో నలంకరింప