నెక్కి, అచ్చట పాపనాశనిని, పుష్కరిణిని, వెంకన్నను, వామన తీర్థమును సేవించెడివారు[1]
ఇంచుమించు క్రీ.శ. 1300 ప్రాంతమువాడగు మంచన, తన కేయూర బాహుచరిత్రలో రథోత్సవమును, జాతరను సూచించినాడు. ముఖ్యస్థలాలలో ప్రతి సంవత్సర మొక నిర్ణయ మయిన దినమున రథోత్సవము చేస్తుండిరి. అదియే తీర్థయాత్రగా నుండెను. ఆ యాత్రయే జాతర యయ్యెను. రథోత్సవకాలమందు పల్లెజను లెట్లాచరించుకొనిరో కదిరిపతి మహాకవి యిట్లు వర్ణించినాడు.
"ఉత్సవాలోకనాయాతనానాజనవ్రాతంబులో తమ తమ జనంబుల గానక కాందిశీకులైన వారల మీవారిం జూపెదమని తోడుకొనిపోయి విజనస్థలంబుల నొడబడకుండిన (యువతులను) పుడమిం బడవైచి యీలువు గొని విడిచినం గ్రమ్మరి తమ్మన్వేషించు నత్తమామల గలిసికొని తేలుగుట్టిన దొంగలం బోలె మెలంగు ముగ్ధాంగనలును... మరియు కటిఘటతార్ద్ర వసనఖండంబులతో బొర్లుదండంబు లిడువారలకు గడితంపు పచ్చడంబు లుల్లెడల వడువుసం బట్టువారును, నిట్టసిగల భాగవతులకు వ్యజన వీజనంబుల వీచువారును, ఆగంతులకు శీతలోదకంబులుం బానకంబులును నీరు మజ్జిగయుదెచ్చి గైకొనుడని ప్రార్థించి యిచ్చువారును" అందుండిరి.[2] (ఉల్లెడ పదము శబ్దరత్నాకరములో లేదు. వివాహాలలో గండదీపము మోయునపుడు ఒక దుప్పటిని తీసుకొని నలుగురు నాలగంచులు పట్టి మధ్యన నొక కర్రతో ఎత్తి డేరాలవలె పైన పట్టిన దానిని రాయల సీమలో ఉల్లెడ యందురు.)
సంక్రాంతి పండుగ తెనుగువారి ముఖ్యమగు పండుగలలో నొకటి. రాయల సీమలో దానిని పనుల పొంగలి యనిరి.
"ఇంక నాల్గావంబు లిడనైతిగా యంచు
గుమ్మరి నెమ్మది గుందికొనక