శ్రీమద్రామానుజులవారి కాలములో శ్రీపతి పండితుల యభిప్రాయ ప్రకారము, తిరుపతి వీరభద్రుడు వెంగళయ్యకాగా అతని ప్రభావము తెనుగు దేశముపై బహుశీఘ్రముగా వ్యాపించుకొనిపోయెను. ఈనాటివలెనే క్రీ.శ. 1500 లో కూడా తిరుపతి మాహాత్మ్యము దక్షిణాపథమం దంతటను నిండుకొనిపోయెను. వేంకట శబ్దమునకు (వేం: కటపతి. వేం అంటే పాపాలట! ఎక్కడిధాతువో యేమో?) ఒక కొత్త అర్థమును ఇటీవలి పండితులు కల్పించినారు. ఇది సంస్కృతశబ్దము కాదు. ఇది వెంగడము అను అరవపదము. తెలుపుగల బొల్లిగట్లు అగుటచేత తెల్లనిగట్లు అనుటకు అరవములో వెంగడము అన్నారు. వెంగళ దాని పర్యాయపదము. తిరుపతికి వెళ్ళు భక్తులు పడినపాట్లు నాకాలపుకవి యిట్లు వర్ణించెను.
"అవశనవ్రతముచే సతులు కార్శ్యంబున
గనుపట్టు నోరి బీగములవారు
మ్రొక్కు దీర్చుటకునై మూకమూకలు గూడి
యేతెంచు తలమోపుటిండ్లవారు
ప్రాణముల్ పిడికిట బట్టుక యిట్టట్టు
దెమలని శిరసుకోడములవారు
దైహికాయాసంబు దలపక దొర్లుచు
నడతెంచు పొరలుదండములవారు
నామటామట మ్రొక్కు వా రడుగునడుగు
దండములవారు మిగుల సందడి యొనర్ప
నడరి పన్నగ సార్వభౌమాచలేంద్రు గొలువ
కోటానుకోట్లు పెంగూట" మరిగె.
దిగువతిరుపతిలో ఆళ్వారుతీర్థసేవ, గోవిందస్వామిసేవ చేస్తుండిరి. నానావిధకులు దారిలో నగపడుతుండిరి.
"త్రోవగూర్చుండి బొంతలు మ్రోలబరచి ముదురుటెండల కోరగా ముసుగు జేర్చి పట్టెదండలు మొరయించి పాడుకొనుచు నలరుదాసళ్ళు....."
బహుళముగా నుండిరి. తర్వాత భక్తులు "మందలుగూడి" శేషశైలము