వరంగం బెరయకోవె" లనుచు బికిర మెత్తె""[1] శ్రీరంగమే పెద్దకోవెల అని పై అరవమున కర్థమని భాషాతత్త్వ శాస్త్రానుసరణి నూహింతును. పై చరణముతో ప్రారంభమగు ఒక ప్రసిద్ధమగు తమిళపాటగా అది కానవస్తున్నది. మాడభూషిమఠం వేంకటాచార్యులగారు తమ పాశురపరిమళములు అను పుస్తకములో నిట్లు వ్రాసిరి.
తిరువరంగము అను శబ్దము ద్రావిడమున శ్రీరంగము తిరువ రంగం తిరుమాల అనునది ద్రావిడ దివ్యప్రబంధములోని మొదటి వేయిగానములలోనిది. దీనిని బాడినవారు ఆంధ్రలోక విదితులైన విప్రనారాయణులవారు. వారి చరిత్రమును-వైజయంతీ విలాసమును చదువని యాంధ్రుడుండడు. వారు పన్నిద్దరాళ్వారులలో నొకరు. వారి తిరువరంగం తిరుమల శ్రీవైష్ణవాలయంబులలో గానము చేయబడును." అందలి యొకగానమును మాడభూషివారు తెనుగులో నిట్లువ్రాసినారు.
"ధనువొకటన్ మహాజలధి దర్పమణంచి జగంబు పొంగ భం
డనమున రావణాసురు నడంచిన యామనసేవకుండు నె
క్కొనివసియించు నీ పేరియకోవెలరంగని దామమంచు బే
ర్కొనకయె కాలముం గడవ ద్రోతురె తత్కరుణావిదూరులై"
ఇత్యాది స్తోత్రములలో "తిరువరంగం పెరియకోవెల" అను భావము లిమిడి యున్నవి.
"బలియ, బికిరంబు, జోగు, గోపాళ మనుచు[2] మరికొదరు బయలుదేరిరి. జోగు అనునది ఎక్కలి దేవిని కొలుచు జక్కులవారు యాచించు బిచ్చము. వారు "ఎక్కలేజోగు" అని నేటికిని యాచింతురు. గోపాళము=సందెగోపాళ మనునదే. గతప్రకరణములో తెలిపినట్టిదే
శ్రీరంగములో "రామానుజకూటము లుండెను"[3] కాని తెనుగు దేశములో నుండెనోలేదో చెప్పజాలము. తంబళ్ళనుగురించి యిదివరలో కొంత