"చనుపకముల తావిగొనక రోజాలుండి తేటిమలక మల్లెతెల్ల విరుల
చందు చూచి విరహ జయకాంక్షమైదుగానా యొనర్చె నుత్తరాయణమున."[1]
(చనుపకము=చంపకము మలిక్ శబ్దమును మలక చేసినారు. చందు=చంద్రుడు. దుగానా=రెండు నమాజులు.)
శైవ వైష్ణవులలో పరస్పరాసహనము పూర్వమువలెనే యుండెను. విప్రనారాయణునిపై దొంగతనమును మోపి ధర్మాసనసభయందు విచారణచేసిన కాలమందు "వైష్ణవులకుం దలవంపులుచేసె" నని వైష్ణవులిట్లు ఖేదపడిరి.
"అభియాతుల్ మొద లీమతంబునకు మాయావాదు లాత్మీయ దు
ర్వ్యభిచారం బది మేరువంతయిన మాయన్ మిథ్య లేంద్రుడు పె
ల్లభియోగింపదు రన్యదుష్కృతము గోరంతైన గొండంతగా
ప్రభువుల్ హాస్యరసప్రియుల్ మనల నీపాటైన మన్నింతురే?"
మొదలే మామతానికి శత్రువులున్నారు. వారు తమవారి తప్పులను కప్పిపుత్తురు. మన తప్పులైతే కొంచెమున్నను కొండంతచేసి రచ్చకెక్కింతురు. అనుటచే ఈ సూచనయంతయు అద్వైతుల దిక్కే యనుట స్పష్టము. "బ్రహ్మ సత్యం జగ న్మిథ్యా" అను మా యామిథ్యావాదమును అద్వైతులు చేసిరి. ఇతరులు "ఈతన్ని చోరు డనరాదు; జారు డనరాదు; అనాదారు డనరాదు." "పోరన మీర లీతనికి బూనుడు బ్రహ్మరథంబు వైష్ణవుల్" అని సోల్లుంఠనము లాడిరి.[2] ఇతరులనగా అద్వైతులును, శైవులును కావచ్చును.
హిందూసంఘమునకు విశేషముగా కష్టము కలిగించినది సాంప్రదాయి కతయే. వివిధసంప్రదాయకములలోని జనులలో అనేకకుటుంబములవారు కేవలము సంప్రదాయము పేరుపైననే బ్రదుకుటకు మొదలు పెట్టిరి. శైవలమని మఠాల నాశ్రయించినవారు, వైష్ణవులమని దేవాలయముల నాశ్రయించినవారు, మతము పేరుతో బిచ్చమెత్తుకొను వారును ఈ కాలములో బహుళమైరి. నంబులు పలువురు "దాసరిబుట్ట" లతో బయలుదేరి బిచ్చమెత్తిరి. విప్రనారాయణుడు "తిరు