పుట:Andrulasangikach025988mbp.pdf/275

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

మతము

కృష్ణరాయల కాలములోని పరిస్థితులలో మార్పు లంతగా రాలేదు. కాని తర్వాతి వాఙ్మయములోని కొన్ని విశేషముల నిందు తెలుపుట యవసరము. హిందువులను వారిమతమును, వారిసృష్టిని, (Culture) నిరంతరము ముసల్మానులు ద్వేషించినను హిందూరాజులు సుల్తానులతో రాజకీయముగా భిన్నించిరే కాని వారి మతాన్ని ద్వేషించినవారు కారు. ప్రజలుకూడ ఇస్లాముమతమును ద్వేషించినవారు కారు. పల్నాటిసీమలో పల్నాటి వీరాలయములలో ఒక ముస్లిం గోరీ కూడా దేవాలయావరణమందే కలదు. నేటికిని ముసల్మానులుకూడా కార్తీకమాసమందు జరుగు పల్నాటి వీర పూజలలో పాల్గొందురు. గుల్బర్గాలోని ప్రసిద్ధమగు వలీదర్గాపై భవనమును సేర్ నారాయణ మహారాజ్ అనునతడు కట్టించెనని ప్రతీతి కలదు.

పెనుగొండలోని బాబయ్య అను తురక వలీదర్గాకు సాళువ నరసింగరాయలు కొన్ని గ్రామాలు దానముచేసెను. దానికే తర్వాతి రాజులును దానాలిచ్చిరి. జటిలవర్మ కులశేఖర పాండ్యరాజు శా. శ. 1477లో ఒక మసీదుకు గ్రామము దానము చేసెను. ముసల్మానుల మసీదులు ఓరుగంటిలో నుండెను. "ఇదె కర్తారుడుండు తుర్కలమసీదు" అని క్రీడాభిరామములో స్థలనిర్దేశము కూడా చేయబడినది. ఈ కర్తారుడు (కర్తార్) అన యే ముస్లిందేవతయో తెలియదు.

         "కర్తారుం డనుచుం దురుష్కులు మొదల్గా గొల్వ బ్రత్యక్షమై
          మార్తాండుం డుదయించె నబ్ధితటసీమ ప్రాశితౌర్వాకృతిన్"[1]

అని క్రీ.శ. 1585లో నుండిన మల్లనకవి వర్ణించెను. దీనినిబట్టి సూర్యుని తురకలు కర్తారు డనిరని తలపవచ్చును. కాని ఇస్లాము మతములోను, దానికి సంబంధించిన భాషలలోను కర్తారుపద ముండినట్లు కానరాదు. ముసల్మానుల రంజానును రోజాను ఒక కవి యిట్లు వర్ణించెను.

  1. విప్రనారాయణచరిత్ర - చదలవాడ మల్లయ 3 - 50.