పుట:Andrulasangikach025988mbp.pdf/274

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

5 వ ప్రకరణము

విజయనగర సామ్రాజ్య కాలము

క్రీ.శ.1530 నుండి 1630 వరకు.

శ్రీకృష్ణదేవరాయ నిర్యాణానంతరము విజయనగర సామ్రాజ్యము 1565 వరకు మహోజ్జ్వలముగా సాగి, తళ్ళికోట యుద్ధములో దానికి మొదటి పెద్దదెబ్బ తగిలెను. దక్కన్ సుల్తాను లేకమై రామరాజును చంపి ఆతని సైన్యమును చెదరగొట్టి విజయనగరాన్ని ఆక్రమించుకొని ఆరునెలలు అదేపనిగా విధ్వంసనకర్మలో నుండిరి. కాని విజయనగర బలము క్షీణించలేదు. తిరుమల దేవరాయలు పెనుగొండను రాజధానిగా చేసుకొని రాజ్యముచేసెను. అతని యనంతరము శ్రీరంగరాయలు చాలా దుర్బలుడగు రాజగుటచేత తిరుపతివద్ద నుండు చంద్రగిరికి రాజధానిని మార్చుకొనెను. మొత్తానికి క్రీ.శ. 1630 తర్వాత విజయనగర సామ్రాజ్యము అంతరించెను. దానిశాఖ యొకటి మాత్రము తంజావూరులో రెండుతరాలు దేదీప్యమానముగా వెలిగెను.

ఓరుగంటిరాజ్య పతనానంతరము మహమ్మదీయులనుండి హిందువులను విజయనగర సామ్రాజ్యము ఇంచుమించు 230 ఏండ్లు రక్షించెను. క్రీ.శ. 1600 తర్వాత ముసల్మాను సుల్తానుల పాలనములోనికి ఆంధ్రదేశమంతయు చేరినదయ్యెను. అంతలోనే ఫ్రెంచివారు, ఇంగ్లీషువారు దక్షిణాపథరంగముపై ప్రత్యక్షమైరి. వారుకూడా దేశమును దోచుకొని పోదలిచినవారే కాని రక్షింప దలచినవారు కారు. అందుచేత క్రీ>స. 1600 నుండి 1800 వరకు ఆంధ్రదేశములో అరాచకము పూర్తిగా తాండవించెను. అదొక అందకార యుగము. 1800 నుండియైనను ఉత్తరసర్కారులు రాయలసీమ ఒక విధమగు స్థితికి వచ్చెను. కాని తెలంగాణా మాత్రము ఆధునిక కాలమువరకు దుర్బరస్థితిని యెటులో భరిస్తూ వచ్చినది.