రచ్చకట్టకు వాదిప్రతివాదులు కానుక లిచ్చెడివారు.
"తగవువారలతోట తమకను ల్నొడివి
కట్టకానుక లిడి కడపట నిలుప
గట్టిగా నా కార్యగతి విచారించి
అలయున్న సభవార లాయిరువురను
......బిలిచి యిట్లనిరి అరయంగ
నీమాన్యమైన యందులకు
పరగంగ సాక్షిసంబంధములు కలవె
యనిన ఎక్కడిసాక్షు లలనాడె పోయి
రనిన పత్రముకలదా యని యనిన
అడర మాతోటి యేడవ పెద్దాతాత
కిడిన పత్రము చెడ కిన్నాళ్ళదాక
దనరుచునుండంగ తామ్రశాసనమె
యనిన సత్యము సేయుమన...పలుమాట లేల తప్పదు శౌరిసాక్షి
యని సత్య మొనరించి యలవాని గెలిచి...........జనుదెంచె" [1]
పై పంక్తు లానాటి పంచాయతీ న్యాయస్థాన విధానమును వెల్లడించును. సభవారు వాదములను విని సాక్ష్యములు తీసుకొని "సత్యము (ప్రమాణము) చేయించి" శాస్త్రములను చూచి తీర్పు చెప్పెడివారు. "సత్యము చేయుట" సామాన్య విషయము కాదు, ప్రజలు అప్రమాణము చేసిన నిర్వంశ మగుదనియు, సంపద తొలగిపోవుననియు భయపడిరి. పంచాయతీ సభ్యులును అన్యాయముగా తీర్పు చెప్పుటకు భయపడెడివారు. అయినను అందందు లంచాలు తీసుకొని తప్పుడు తీర్పులు చెప్పువా రుండి రని వేంకటేశశతకములోని సూచనలను తెలిపినాము. కాని అది యరుదు. అట్టివారికి సంఘమందు మర్యాద లేకుండెను. పంచాయతీ సభా విశిష్టతలు ఆనాటి తెనుగు సారస్వతములో పలుతావులలో వెల్లడించినారు. అది యుత్తమ పద్ధతిగా నుండెను. ఇంగ్లీషు కోర్టులు, వకీళ్ళు, శాసనములు, బారీకులు, అప్రమాణాల నిర్భయత ప్రబలిన యీ కాలములో ఇక, ఆనాటి అచ్చపు పంచాయతీ రాజ్యముయొక్క పునస్థాపన కానేరదు. ఇది విజయనగర సామ్రాజ్య ప్రథమకాల సాంఘిక చర్చాలేశము.
- ↑ ప. యో. విలాసము. పు. 532-3.