తేనియలు జున్ను మీగడ లానవాలు
పానకములు రసావళ్ళు పచ్చడులు న
వాజ్య మొలుపు బప్పులు కూర లనుపమాన్న
నపుడు ప్రజనెల్ల దనియించె నహరహంబు"[1]
తుదకు పాకములందును కొన్నిజాడ లెరుగలేకున్నాము ! పైవన్నియు బ్రాహ్మణుల విందులే ! ఇతరులలో ఇన్ని లేవు. వాటికి మారుగా మాంస మత్స్యాదిపాకములు చేరును. రాయలు బ్రాహ్మణుల మరికొన్నితిండ్లను గూర్చి తెలిపినారు. పొరివిళంగాయ (వేపుడుబియ్యపు బిండితో బెల్లపుపాకాన చేసిన యుండలు), పెరుగు వడియములు, పచ్చివరుగు ఇవి ప్రయాణభుక్తి సంబారములు.[2] వానకాలములో కలమాన్నము. ఒల్చినపప్పు, నాలుగైదుపొగసిన కూరలు, వరుగుల, పెరుగు, వడియములు, నెయ్యియు-వేసవికాలములో ఉలివెచ్చ అన్నము, తియ్యని చారులు, మజ్జిగపులుసు, పలుచనియంబలి, చెరకుపాలు, ఎడనీళ్ళు రసావళులు (అతిరసములు), వడపిందెల యూరుగాయ, నీరు చల్లయును-చలికాలములో పునుగుబియ్యపు అన్నము (పునుగువాసనగల రాజనములు), మిరియపుపొళ్ళతో కూడిన ఉడుకుకూరలు, ముక్కు కెక్కు ఆవగాటు కల పచ్చళ్ళును, ఊరుగాయలును, పాయసాన్నములు, ఉడుకునేయి, ఇవురగాచిన పాలును బ్రాహ్మణులు కొందరు భుజించిరి.[3] జాతరులకు ఉత్సవాలకు పోవువారు పెరుగుసద్దిని తీసుకొని బాటలందలి కాలువలవద్ద తోటబావులవద్ద చద్దిమూటవిప్పి కలిసి భుజిస్తూవుండిరి. 4-75.
బర్రెయొక్క మీగడ పెరుగు అన్నముతో చిక్కగా కలిపి అందు నిమ్మరసము పిండి, అల్లము ముక్కలు కలిపి యుండెడివారు. ఇదొక విధమగు దధ్యన్నము.
కళలు
విజయనగర చక్రవర్తుల కాలములో కళాభివృద్ధి పరమావధి పొందెను. చక్రవర్తులు, సామంతులు, మంత్రులు, ధనికులు-భవనములను, దేవాలయము