పుట:Andrulasangikach025988mbp.pdf/25

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

గ్రహణకాలములందు దానములుచేసిరి.

నన్నయ కాలము తర్వాతనే బ్రాహ్మణులలో వైదిక నియోగిశాఖ లేర్పడెను. ఆ విభేదము నన్నయ కాలమందు కాని, అంతకు పూర్వమందుకాని లేకుండెను. నన్నయకు 100 ఏండ్లకు ముందు అమ్మరాజ విష్ణువర్ధనుడు రాజ్యము చేసెను. అప్పటివరకు తూర్పు చాళుక్యుల రాజధాని వేగీపురమై యుండెను. అమ్మరాజే రాజమహేంద్రవరమును రాజధానిగా చేసెను. కావున మన కీకాలమందు తూర్పుతీరమందలి (ఇప్పటి సర్కారులు) జిల్లాలలోని స్థితిగతులు కొంతవరకు తెలియవచ్చును.

క్షత్రియులమని అబద్ధం వా సుబద్ధంవా అని వ్రాయించుకొననొల్లని రాజులను నోటినిండుగా శూద్రులని కవులును, పౌరాణికులును అనజాలకున్నను "చతుర్థకులజులు, గంగతోబుట్టువులు" అనిరి. ఇదేకాలమందు తెనుగుదేశమందలి ప్రజలులను "సచ్చూద్రులు" అనిరి. సత్యాది గుణంబులు శూద్రునందు కలిగెనేని వాడు సచ్చూద్రుండగు గాక" (అరణ్య. 4-1-29) అని తెనుగు భారతమందు వ్యాసభారతమందులేని కులమును సృష్టించుటచే ఇది ప్రత్యేకముగా తెనుగుదేశాని కేర్పడెనో యేమో?

బ్రాహ్మణజాతి మహత్త్వమునుగురించి సంస్కృత భారతమందుకూడా విశేషముగా పలుమారు సందర్భరహితముగా కలదు. తెనుగు భారతమందును నన్నయ కొన్ని తన పద్యాలు ఎక్కువగా చేర్చి కొన్ని మూలములోనివి వదిలెను. అనగా తనకు నచ్చిన విశేషములనే తన భారతమందు చేర్చెను. (చూ. అది 1-138 ఆది. 2-61 మరియు 63. ఇవి మూలములో లేనివి)

నన్నెచోడుని కాలమునాటికే (క్రీ.శ. 1150 ప్రాంతమున) శైవముతోపాటు కౌళమార్గాది వామాచారములు దేశ మందు ప్రవేశించెను. దాని విధానమును కొంతవరకు నన్నెచోడుడు కుమారసంభవమం దిటుల తెలిపినాడు. "కొందరు మధుపాన గోష్ఠికింజొచ్చి మండలార్చన దీర్చి (శ్రీ చక్రపూజచేసి) మూలజ వృక్షజ గుడుమధుపిష్ట కుసుమవికారంబులగు సుగంధాసవంబులు కనకమణి మయానేక కరక చషకాదులన్నించి హర్షించి" గౌరిని, శివుని, భైరవుని, యోగినులను, నవనాథులను, ఆదిసిద్దులను కొలిచి ఆసవమును త్రాగుచు దాని నిట్లు వర్ణించిరి :