వివిదంబులగు చిత్రవిరచనలును దసి
లీ మాలుపట్టె యల్లిక బెడందు
పలు తెరంగుల పట్టుతలగడ బిల్లలు
మవ్వంపు కుంకుమపువ్వు పరపు
గలిగి మెరుగలు దిక్కుల గడలుకొనగ
మించు టద్దపు టుయ్యెల మంచమునను
బొలుపు మీరుచు దన యంతిపురము
సతులయూడిగంబులు గైకొంచు నున్నశౌరి'[1]
కొందరు పావలు (సమ్మాళిగలు) తొడిగిరి. జనులకు నిలువుటద్దాలు, చేతి అద్దాలుండెను, ఆచారపరులవి మట్టివని కంచుటద్దాలను వాడిరి. కంచును బాగాతోమి దానిలో చూచుకొనిరి.[2] జనులు ధనము జాలెలను (వల్లువము, వల్లము) నడుమున కట్టుకొనిరి.[3]
బీదజనుల యిండ్లు పూరికప్పులవై యుండెను. మట్టిమిద్దెల యిండ్లును వారికుండినట్లు ఆముక్తమాల్యదలో సూచితిమి. "మట్టిమిద్దెల వారికి నిదురు చెడియె" (ఆము. 4 - 123). భోగమువారి యిండ్లే జనుల యిండ్లపైకి వైభవోపేతముగా నుండెనని విదేశి యాత్రికులు వ్రాసిరి. వారు చాలా ధనవంతులనియు, వారి యిండ్లు ఉత్తమముగా నుండెననియు పీస్ వ్రాసెను.
జనుల ఆచార వ్యవహారములు
మల్లయుద్ధాలు, కుస్తీలు జనులకు ప్రీతి. మల్లయుద్ధాదికల దృష్ట్వా[4] అని యొకడు వ్రాసెను. జనులు సాధారణముగా కంచు పాత్రలలో (కంచాలలో) తినిరి.[5]
మరులు తీగెను తొక్కితే బాట తప్పుదురని ప్రజలు విశ్వసించిరి.