పుట:Andrulasangikach025988mbp.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1 వ ప్రకరణము

తూర్పు చాళుక్య యుగము

న వాఙ్మయ చరిత్ర నన్నయభట్టుతో ప్రారంభమగుచున్నది. అతడు తూర్పు చాళుక్యరా జగు రాజరాజనరేంద్రుని కులబ్రాహ్మణుడు. అ రాజు రాజమహేంద్రవరము రాజధానిగా వేంగిదేశమును క్రీ.శ. 1022 నుండి 1063 వరకు రాజ్యము చేసెను. మనకు తూర్పు చాళుక్యుల కాలపు చరిత్ర సరిగా తెలియదు. ఇచ్చట నన్నయ కాలమునుండి కాకతీయుల ప్రాబల్యము వరకు అనగా ఇంచుమించు క్రీ.శ. 1000 నుండి 1200 వరకు తెనుగుదేశమం దుండిన ఆచార వ్యవహారములు తెలియవచ్చినంతవరకు చర్చింపబడును.

రాజరాజ నరేంద్రునికి 400 ఏండ్లకు పూర్వమే తెనుగు దేశమున విరివిగా వ్యాపించిన బౌద్ధమతము మాయమైపోయెను. చాళుక్య రాజులు శైవులు. అందుచేత వారి రాజ్య మందు శైవమత వ్యాప్తియు, బ్రాహ్మణాధిక్యతయును ఎక్కువయ్యెను. నన్నయకు ముందు జనులు పాటలు, పద్యాలు వ్రాసుకొని ఆనందించిరి. కాని కొన్ని శాసనములందు తప్ప మరెచ్చటను మనకు నన్నయకు పూర్వపు పద్యాలు లభింప లేదు. చాళుక్యరాజు "పార్వతీపతి పదాబ్జద్యానపూజా మహోత్సవమందు" ప్రీతి కలవాడని నన్నయ తెలిపినాడు. చాళుక్యులు క్షత్రియులు కానట్లున్నది. అయినను రాజవంశము లన్నియు సూర్య చంద్రులకు లంకె పెట్టుకొని క్షత్రియత్వమును పొందినట్లుగా చాళుక్య వంశము కూడ క్షత్రియ వంశమయ్యెను. పైగా "హిమకరు తొట్టిపూరు భరతేశకురు ప్రభు పొందు భూపతుల్ క్రమమున వంశకర్త లనగా మహినొప్పిన యస్మదీయ వంశము" అని నన్నయచే చెప్పించు కొన్నాడు. కాని అతని పూర్వీకులు తాము బ్రహ్మ ప్రార్థనాంజలిలో పుట్టిన ఒకమూల చాళుక్యపురుషుని సంతతివారమనిరి. మరియొకశాఖ మరొక విధముగా వ్రాయించుకొనెను. ఆ కాలములో రాజులందరును ఏదో యొక విధముగా సూర్యచంద్ర వంశీయ క్షత్రియులుగా వ్రాయించుకొన్నవారు. ఆ కాలమున శైవాలయములు సత్రములు రాజులు కట్టించిరి. బ్రాహ్మణులకు అగ్రహారములను మాన్యములను సంక్రాతి లేక