పుట:Andrulasangikach025988mbp.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయ ముద్రణ పీఠిక

నే నేమాత్రమును ఊహించనిరీతిగా ఈ గ్రంథము పత్రికాధిపతుల యొక్కయు, విద్వాంసుల యొక్కయు ప్రశంసకు పాత్రమైనందులకు ధన్యుడనని అనుకొన్నాను. ముఖ్యముగా ఆంధ్రప్రభా సంపాదకులగు శ్రీ నార్ల వేంకటేశ్వరరావుగారికి నేను ఋణపడినాను. ఈ గ్రంథముతో వారి పరిచయము నాకు రెండవమా రన్నమాట! వారి కీ గ్రంథము మెచ్చువచ్చినది. ఒక సంపాదకీయమును వ్రాసిరి. "మన తాత మత్తాతలు" అన్న శీర్షికను నేను చూడగానే నా గ్రంథము జ్ఞాపకమువచ్చి ఇది నా గ్రంథ విమర్శియై యుండునా అనితటాలున అనుమానించితిని. అనుమానము నిశ్చయమే అయినది! వారిచ్చిన యా ప్రకటన మూలమున గ్రంథప్రచార మెక్కువయ్యెను. తర్వాత వారొక సూచననుచేసిరి. ఇంగ్లీషులో సాంఘిక చరిత్ర పద్ధతిగా ఒక్కొక్క విషయమును ఆమూలాగ్రముగా ముగించుచు వ్రాసిన బాగుండుననిరి. కాని యీగ్రంథమందలి మొదటి మూడు ప్రకరణాలు ఉస్మానియా విద్యాపీఠమందలి ఎఫ్.ఏ. విద్యార్థుల కొక పాఠ్యభాగముగను, ఆంధ్ర సారస్వత పరిషత్తు వారును ఆదే భాగమును తమ ప్రవేశ పరీక్షా విద్యార్థులకును నిర్ణయించిన వారగుటచే ప్రకృతము మార్పుచేయుటకు వీలు లేక పోయినది.

ఇతర పత్రికలలో గ్రంథ విమర్శ వచ్చినదని వింటిని కాని నే నేదియు చూడలేదు. ఆంధ్రప్రభా సంపాదకులకు నాపై (అనగా నా గ్రంథముపై) కలిగిన అవ్యాజప్రేమకు నేను కృతజ్ఞతాగుణబద్ధుడ నైనాను. శ్రీ నార్లవారి అభిప్రాయమును గ్రంథాంతమందు 1 వ అనుబంధముగా ముద్రించినాను.

మిత్రులును, సంగీత సాహిత్య విద్యాపారంగతులగు, తెనుగు వచన రచనలో అగ్రశ్రేణిలోని రచయితలును నగు శ్రీమాన్ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు, ప్రేమపూర్వకముగా (22) విషయములను చర్చించి, ఒక విపులమగు లేఖను వ్రాసినారు. అందు ఇంచుమించు అన్నింటిని సవరణలుగా ఒప్పుకొని వారికి నాకృతజ్ఞతలను తెలుపుకొని వారి లేఖను 2 వ అనుబంధముగా ముద్రించుచున్నాను.