పుట:Andrulasangikach025988mbp.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"చలువ దువ్వలువ కుచ్చెలయంచు ముత్తెముల్ పదనఖప్రభకు సలాము చేయ" [శుకసప్తతి]


అని యంటే అ స్త్రీ కన్నులయెదుట నిలిచి పూర్వకాలమందు మన యువతుల విలాస మిట్లుండెనని తెలుపును.

ఒక్కొక్కమారు కొన్నిపుస్తకాలు పూర్తిగా చదివిన మనకు పనికివచ్చు మాటలు రెండో, మూడో దొరుకును. అంతే?

సాంఘిక చరిత్ర దృష్టితో జూచిన బహుగ్రంథాలు వ్రాసిన కూచిమంచి తిమ్మకవి యేమియు సహాయకారి కాడు. మను వసు చరిత్రకన్న తాళ్ళపాక చిన్నన్న ద్విపద పరమయోగి విలాసము చాలా మేలుగా నుండును. ఇందొక్కలావుసమాసము కూడా కానరాదు. కవిత్వము జటిలము, ప్రౌఢము కాదు. కాని ఆతని వర్ణనలే మన చరిత్రకు చాల ముఖ్యమైనవి. జక్కన విక్రమార్క చరిత్రలో "చక్కని వైదుష్యము" ప్రదర్శించెను.

"కల్పాంత దుర్గాంత కలుషాంతక స్వాంత దుర్వారవహ్నికి నోర్వవచ్చు" అని 'ప్రళయకాలాఖీలము'గా వ్రాసెను. కాని అందు మన కేదియును పనికిరాదు. అవే కథలను కొరవి గోపరాజు 'ద్వాత్రింశత్సాలభంజికా కథలు' అను పేరుతో రచించెను. ఆ గ్రంథము మన కత్యంతముగా సహాయపడును. ఈ విధముగా ప్రబంధాలను పరిశోధన చేయవలసి యుండును. ద్వాత్రింశత్సాలభంజికలో, శుకసప్తతిలో, పండితారాధ్యములో, బసవపురాణములో, క్రీడాభిరామములో, వెంకటనాథుని పంచతంత్రములలో వాడిన చాలా పదాలు నిఘంటువులలో లేవు. అందుచేతను సాంఘిక చరిత్రను వ్రాయుటలో కష్టము కలుగును. ఈ పదాలు తెలియకుండిన నేమాయె ననుటకు వీలులేదు. కవులు సాంఘికాచారములను వర్ణించు తావులందే ప్రాంతీయ వ్యావహారిక పదాలను, అప్పటి యాచారములను తెలుపువాటిని వాడినారు. అందుచేత అవి ముఖ్యమైన వగును.

శాసనములలో పర్వాలు, దానాలు, తూకములు, భూమికొలతలు, పొలిమేరలు, ఆయములు మున్నగునవి మాత్రమే తెలియును. స్థానిక చరిత్రలో చాల భాగము కల్పితములతో, అతిశయోక్తులతో, పుక్కిటి పురాణాలతో నిండి యుండును. విదేశియాత్రికులు, వ్యాపారులు, రాయబారులు, కాకతీయ విజయ