సాహిత్య చింతామణిని వ్రాసెను. ఈ రాజు విశ్వేశ్వరకవి యనునతని కగ్రహారము దానముచేసెను. అతడేమివ్రాసినో మనకు లభ్యము కాలేదు. కొండవీటి రాజమహేంద్రవర రాజుల వలెనే రాచకొండ వెలమరాజులును కవులై, పండితులై, రచయితలై, కవి పండిత గాయక పోషకులై ప్రఖ్యాతిలైరి, అయితే రెడ్డి వెలమ ప్రభువులలో కొందరు స్వయముగా రచనలు చేయలేదని ఒకరిద్దరు విమర్శకు లన్నారు. అది కొంతవరకు నిజమైనను ఆరాజుల విజ్ఞతకు, కొట్టు కలుగనేరదు. రాచకొండ రాజుల వద్ద మల్లినాథుసూరి ముఖ్య పండితుడై యుండెను.
రెడ్ల యాస్థానాని కాంధ్రపండితులేకాక, ఇతర భారతీయ ప్రాంతాలనుండి అనేక పండితులు, కవులు, కళావేత్తలు కొల్లలుగా వెళ్ళుతూవుండిరి. అట్టివారిని పరీక్షించి వారి యర్హతలను ప్రభువులను మనవి చేయుటకు శ్రీనాథ కవిసార్వభౌముడు నియుక్తుడై యుండెను. రెడ్లశాసనములలో కొన్నింటిని ఆతడే వ్రాసి ఫిరంగిపుర శాసనములలో "విద్యాధికారీ శ్రీనాధో అకరోత్" అని వ్రాసుకొనెను. మరియు తనను గురించి యిట్లు వ్రాసికొనెను.
"భాషించినాడవు బహుదేశ బుధులతో
విద్యాపరీక్షణ వేళలందు"[1]
రాజుల యాస్థానాలలో పరిక్షాదికారులనుగా ఉద్దండ పండితకవులను నియమిస్తూ వుండిరని,
"అదిపు కొలువున నే బరీక్షాధికారి
నగుటజేసియు నొక విప్రు దెగడిపుచ్చి"[2]
యనుదానినిబట్టి తెలియును.
రాజులేకాక మంత్రులును బహుభాషావేత్తలై యుండిరి.
"అరభీభాష తురుస్కభాష గజ కర్ణా
టాంధ్ర గాంధార ఘూ
ర్జర భాషల్ మళయాళిభాష శకభా
షా సింధు సౌవీర బ