పుట:Andrulasangikach025988mbp.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

         క. కరణము తన యేలిక కుప
            కరణము, నిర్ణయ గుణాధికరణము, ప్రజకున్
            శరణము, పగవారలకును
            మరణము నా జెల్లు నీతిమంతుండైనన్.[1]

కళలు

ఓరుగంటి రాజుల కాలములోవలెనే ఈ కాలమందును కళాపోషణము బాగా జరిగెను. అంతేకాదు, ఈ కాలములో కళాపోషణము ఉచ్చస్థాయి నందెను. తుది రెడ్డిరాజులు వసంతరాజ బిరుదాంచితులగుట ఈ కళాపోషణమున కొక ప్రబలతర నిదర్శనము. కవిసార్వభౌముడును, ఆసేతువింధ్యాది పర్యంతము తన కీడుజోడు లే డనిపించుకొన్నవాడును, బహుశాస్త్ర పురాణ పారంగతుడును, కవితలో నూతన యుగస్థాపకుడునునగు శ్రీనాథుడు విద్యాధికారియట! అఖిలాంధ్ర వాఙ్మయమునకు ప్రామాణికాచార్యత్రయములోనివాడగు ప్రబంధ పరమేశ్వరుడు ముఖ్యాస్థానకవి యట ! శివలీలా విలాసకర్తయగు నిశ్శంక కొమ్మన రెడ్డి రాజుల కీర్తనల చేసినవాడట ! సహస్ర విధాననవాభినయ కళాశ్రీశోభితలకుమాదేవి రాజసన్నిధిలో నిత్యనూత్నముగా నటంచినదట ! బాలసరస్వత్యాది మహాపండితు లాస్థాన దివ్యజ్యోతులట ! స్వయముగా రెడ్డి, వెలమప్రభులు కవులై, వ్యాఖ్యాతలై, సాహిత్యాచార్యులై సర్వజ్ఞులై సర్వజ్ఞ చక్రవర్తులైన దిగంత విశ్రాంత యశోవిశాలురట ! కర్పూర వసంతోత్సవములకు సుగంధ భాండాగారాధ్యక్షు లుండిరట ! ఇక కళాభివృద్ధికి కొదువయుండునా ?

ప్రోలయవేముని ఆస్థానమున లొల్ల మహాదేవికవి యనునత డుండెనని మాత్రమే మనకు తెలియును. (రెడ్డిసంచిక, పుట. 518)

ఆయుర్వేదమందు భూలోకధన్వంతరియని పేరుపొందిన భాస్కరార్యునికి పేదకోమటివేముడు అగ్రహారములు దానము చేసెను. (రెడ్డిసంచిక ! పుట 89.)

నాలుగు "వే"లు కలముతో నిచ్చినకవికి ఎనిమిదివేల నాణెములిచ్చిన అనవేములు రాజులుగా నుండ కొంతవిద్య నేర్చిన వారందరును కవులేయైరి.

  1. సింహాసనద్వాత్రింశతి, భా 2. పు. 108, 109.