దేశమందనేక స్థలాలలో ముడిలోహమును భూమినుండి తవ్వి, వాటిని కరగించి ఇనుమును సిద్ధము చేసిరి. దానినుండియు యుక్కునుకూడ సిద్ధము చేసిరి.
"వయ్యంది గాచి కమ్మరి
చయ్యన బదనిచ్చు నుక్కు చక్రము మాడ్కిన్.[1]
(వయ్యంది అనగా కుంపటి.) తెలంగాణాలో నిర్మల కత్తులు జగద్విఖ్యాతి కాంచియుండెను. అచ్చటి కత్తులు అచ్చటి యుక్కు డెమాస్కస్ నగరాని కెగుమతి యగుచుండెను. మెరుగు టద్దాలుకూడా సిద్ధమవుతూ వుండెను. వాటిని శుభ్రము చేయుటకేమో మెరుగురాతి పొడిని వాడినట్లు కానవస్తున్నది.
"మెరుగు టద్దంబుల నంటిన మెరుగురాతిపొడియును వోలెన్"[2] అనుటచే నిది ఊహ్య మవుతున్నది.
ఓరుగంటిలోని వెలివాడలోని మేదరి పడచులు కూడ "అలతి యద్దపు బిళ్ళయనవోక వీక్షించు" చుండిరి. (క్రీడాభి) దీనినిబట్టి అద్దాలు చిన్నవి పెద్దవి బీదవారి యందుబాటులో నుండునంతటి చౌక వస్తువులు, అద్దముల నెట్లు సిద్ధము చేయుచుండిరో అ పరిశ్రమ యెచ్చ టెచ్చట నుండెనో యదిమాత్రము తెలియ రాలేదు.
వ్రాత విశేషముగా తాటాకులపయిననే జరుగుతూ వుండెను. తాటాకులపై వ్రాయు లేఖినిని గంటము అనిరి. దానిని నానా విధములుగా సిద్ధము చేస్తుండిరి. వ్రాయని రెండవ కొనను ఆకుల చెక్కుటకు కత్తిగానో లేక అందమైన రేఖలతోనో సిద్ధము చేసెడివారు. మంత్రులు, సంపన్నులు బంగారు గంటములతో వ్రాసిరి.
"కలము పసిండి గంటమున
కాటయవేము సమక్షమందు, స
త్ఫలముగ రాయసప్రభుని
బాచడు వ్రాసిన వ్రాలమోతలన్