పుట:Andrulasangikach025988mbp.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇట్టి సూచనలనుబట్టి పన్ను లియ్యని వారిని కష్టపెడుతూ వుండిరి. కాని కవులను పండితులను శిష్టులను కష్ట పెట్టి యుండరు.

అనపోతరెడ్డి కంచి, పేరి, పొన్ని అను ముగ్గురు భోగపుసానులకు కొన్ని గ్రామాలను ధానము చేసెను. ఆ వేశ్యలు తమకిచ్చిన గ్రామాలలో చెరువులు కట్టించిరి. ఈ విషయమును గమనించిన అ కాలమందు ధనికులును సామాన్య జనులును కూడ జలాధార నిర్మాణములందుత్సాహులై యుండి రనవచ్చును.

తెలంగాణములో వెలమరాజులు అనేక నూతన తటాకములను తమతమ పేర కట్టించినవి నేటికిని చెడిపోక తరీసేద్యమునకు ముఖ్యాధారములై యున్నవి. మాధవనాయుడు సింగమనాయుడు మున్నగు వెలమరాజులు తమతమ పేర అనేక గ్రామాలనుకూడ నిర్మించిరి. అవి నేటికిని వారి పేర్లతోనే వర్ధిల్లుతూ వున్నవి.

ఈవిధముగా మొత్తముపై ఆంధ్రదేశమంతటను క్రీ.శ. 1300 నుండి 1410 వరకు ప్రజలు సుఖముగా జీవించిరని చెప్పవచ్చును.

వ్యాపార పరిశ్రమలు

ప్రాచీనము నుండియు తెనుగువారు సముద్రవ్యాపారమును చేసినవారు. కృష్ణా, గోదావరి, విశాఖపట్టణము జిల్లాలవారికి సముద్రతీరముండుటచేత వారికి సముద్రవ్యాపారమునకే యెక్కువ అవకాశములుండెను. వారు బర్మా, మలయా, ఇండోనీషియా, చీనా, సింహళద్వీపాలతో విశేషముగా వ్యాపారము చేసిరి. పై దేశములనుండియు పర్షియా, అరేబియా దేశాలనుండియు నానావిధములగు సరుకులు తెనుగు తూర్పు తీరమందలి రేవులలో దిగుతుండెను. నేలబేరానికి దొంగలు తగిలినట్లుగా సముద్రవ్యాపారానికి దొంగలుండిరి. అందుచేత రాజులు వారి నణుచుటకై ప్రయత్నాలు చేస్తూవుండిరి. కాకతీయ గణపతి చక్రవర్తి కాలానికి ముందును, కాకతీయ రాజ్యపతనానంతరము దేశము తురకల వశమైనప్పుడును సముద్ర వ్యాపారము స్తంబించియుండెను. వేమారెడ్డి తమ్ముడు మల్లారెడ్డి పేరుపొందిన శూరసేనాని.