పుట:Andrulasangikach025988mbp.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

         ఆంధ్రనైష ధకర్త యంఘ్రి యుగ్మంబున
              తగిలియుండెనుకదా నిగళయుగము
         వీరభద్రా రెడ్డి విద్వాంసు ముంజేత
              వియ్యమందెనుకదా వెదురుగోడిగ
         సార్వభౌముని భుజా స్తంభ మెక్కెనుగదా
              నగర వాకిట నుండు నల్లగుండు

         కృష్ణవేణమ్మ కొనిపోయె నింత ఫలము
         బిలబిలాక్షులు తినిపోయె తిలలు పెసలు
         బొడ్డుపల్లెను గొడ్డేరి మోసపోతి
         నెట్లు చెల్లింతు టంకంబు లేడునూర్లు;

ఆనాడు పన్ను లియ్యనివారి నెన్నివిధముల కష్టపెట్టుచుండిరో యీ పద్యము బాగా విశదపరచినది. చిత్రమేమనగా క్రీ.శ. 1900 వరకు హైద్రాబాదు సీమలోని పల్లెలలో పటేలు, పట్వారీ లివే పద్ధతులను అవలంబిస్తూవుండిరి. ఊరిముందర చావడియుండెడిది. అందులకు చేతులకు కట్టెబేడీలువేయు "కోడాలు" ఉండెడివి. రెండుచేతులను మణికట్టువరకు రెండుకట్టెల రంధ్రములందుంచి ఒక వెదురు చీలను (గొడిగను) వాటికి బిగించువారు. మరియు ఎండలో నిలబెట్టి, బండలెత్తుట లేక ఊరి ముందర నుండు గుండును భుజముపై మోయించుట లేక ఒక పెద్ద మొద్దుకు గొలుసునుకట్టి దానిని కాళ్ళకు తగిలించుట. ఇట్టివన్నియు చేయిస్తూ వుండిరి. అనగా ఒడ్డెరాజుల సృష్టి దేశమంతటను వ్యాపించెనన్నమాట. అయితే తటాలున ఒడ్డెరాజులే యీ శిక్ష లన్నింటిని ప్రవేశపెట్టిరనుట కాదు. అంతకుముందు ఇట్టివి యాచారమం దుండెనేమో! కాని వాఙ్మయములో వాటి సూచనలరుదు. ఒడ్డెరాజుల యవయశస్సుమాత్ర మీ శ్రీనాథుని ఛాటుధార యున్నంతకాలము తెలుగునాట నుండకమానదు.

       క. ఓరీ కోమటి ముక్కున
          నీరెత్తుడు, మేము కినియనేరక యున్నన్
          నోరికి వచ్చిన యట్టులు
          వారణ యొక్కింత లేక వదరు లరచెడిన్.[1]

  1. కేయూరబాహు చరిత్రము, అ. 3. ప. 201.