పుట:Andrulasangikach025988mbp.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇది తెలంగాణా తరీసేద్యమును బాగుగా నిరూపిస్తున్నది. పలనాటి సీమ నల్లగొండజిల్లాకు దగ్గరిభాగము. మిరియాలగూడా తాలూకాకు ప్రక్కనిది. పలనాటిలో నాపరాళ్ళు విశేషముగా నుండెను. అదేమితో అచట చెన్ననిమహిమనో యేమో ఆకాశాన మేఘము ఆవరిస్తే చాలు నాపరాలలో విత్తిన యావనాళములు ఫలిస్తూవుండెనని క్రీడాభిరామకర్త యీ విధముగా ఆశ్చర్యపడెను.

         "చిత్తముగూర్చి మాచెరల
          చెన్నడు, శ్రీగిరిలింగమున్ కృపా
          యత్తతతోడ ముల్కీవిష
          యంబునకా, మహిమంబు చెల్లె, గా
          కుత్తరలోన మింట జల
          ముట్టినమాత్రన, నాపరాలలో
          విత్తిన యావనాళ మభి
          వృద్ధి ఫలించుట యెట్లు చెప్పుమా!"

ముల్కివిషయ మన ములికినాడు. మహబూబునగరు, కర్నూలు, గుంటూరు ప్రాంతాలందలివే. అయినను పలనాటిలో రేగడిభూమియు విశేషముగా నుండెను. అందుచేతనే అక్కడ జనులందరు జొన్నలనే పండించి తినుచుండిరి.

         "జొన్నకలి జొన్నయంబలి
          జొన్నన్నము జొన్నపిసరు జొన్నలె తప్పన్
          సన్నన్నము సున్నసుమీ
          పన్నుగ పల్నాటనున్న ప్రజలందరకున్."
          చిన్నచిన్న రాళ్ళు చిల్లరదేవళ్ళు
          నాగులేటి నీళ్ళు నాపరాళ్ళు
          సజ్జ జొన్నకూళ్ళు సర్పంబులును తేళ్ళు
          పల్లెనాటిసీమ పల్లెటూళ్ళు.
          రసికుడు పోవడు పల్నా
          డెసగంగా రంభయైన నేకులె వడుకున్
          వసుధేశుడైన దున్నును
          కుసుమాస్త్రుండైన జొన్నకూడే కుడుచున్.[1]

  1. శ్రీనాథుని చాటుధారలు.