సంపాదిత భయ రౌద్రా
కంపితుడై సెట్టి బెగడి కన్నులు మూసెన్.[1]
చంపుడుగుళ్ళు అని నరబలు లిచ్చు దేవాలయములకు పేరుండె నేమో ? అటవికులగు గోండు, కోయ మున్నగువారిలో నీ యాచారమెక్కువగా నుండినట్లు కానవచ్చును. వారునరబలి నెట్లు యిచ్చిరో కవియిట్లు వర్ణించినాడు.
"ఆనగరంబు దిసనుండి దిమ్ము రేగినయట్లు తూగొమ్ములు, పువ్వనంగ్రోవులునున్, తప్పెతలును, డక్కులును పెక్కువిధంబులదిక్కులును చెవుడు పరుపుచుమ్రోయ, నవ్వాద్యరసంబునకు బాసటయై తమ యార్పులున్ పెడబొబ్బలును గిరిగహ్వరంబుల నుపబృహితంబులుగా గంధపుష్పార్చితుండగు నొక్కదీనుని నడుమ నిడుకొని కురుచ కాసగొరకలు మెరయించుచు బరికెతలల కరకుకౌండరులు ననుదెంచిరి."[2]
పైవచనములో తూగొమ్ములన తూ అను ధ్వనినిచ్చు కొమ్ములు, పువ్వునగ్రోవు లన పిల్లనగ్రోవివంటి వాద్యములు అని అర్థముండు ననుకొందును. ఈ రెండును శబ్దరత్నాకరాదులందు లేవు, అధేవిధముగా 'కౌండరి' శబ్దములేదు. కొండరియన కొండలందుండు అటవికుడని యర్థము. (సూనరి, జూదరివంటి దీ పదము). కిరాతుడు, బోయ అని సూ.రా. అం. నిఘంటువు.
వీరశైవ మతవ్యాప్తితో కొన్ని ఘోరాచారములుకూడ తెనుగుదేశములో వ్యాపించెను. శివార్పణముగా అంగములను ఛేదించుకొనుట, తుదకు తమ తలలను తామే నరకుకొనుట, ఆత్మహింసలను చేసుకొనుట మేరలేని భక్తిలక్షణమనియు అట్టివా రందరును తప్పకుండా కైలాసాన్ని చేరుకొందురనియు, శివసాయుజ్య మందు సచ్చిదానంద మందుందురనియు బోధించిరి. భక్తులు నమ్మ ఆచరించిరి.
రెడ్డిరాజులలోని "అన్నయరెడ్డి ఏ యుద్ధమందో వీరమరణ మందినట్లు తోచుచున్నది. ఈతని పుణ్యమునకుగాను శ్రీశైలమందు మల్లికార్జునస్వామి దేవాలయములోని నందిమండపమునకు సమీపమున వీరశిరోమండపమనునది క్రీ.శ. 1777 లో అన్నవేమునిచే నిర్మింపబడినది. ఈ వీరమంటపమందు వీరు లనేకులు